సీఐడీ ప్రశ్నల వర్షం: ఉక్కిరి బిక్కిరి అవుతోన్న No. 1 న్యూస్ ఛానల్ యజమాని
అమరావతి: గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చోటు చేసుకున్న విధ్వంసంపై నెంబర్ వన్ న్యూస్ ఛానల్ యజమాని సుధాకర్ నాయుడికి సీఐడీ విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
తుని విధ్వంసం ఘటనలో విచారణకు రావాలంటూ సీఐడీ పంపిన నోటీసులను అందుకున్న ఆయన ఈ ఉదయం రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రాగా, తుని రైలు దహనం వెనుక ఆయన పాత్రపై సీఐడీ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపిస్తూ ఆయన్ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని మళ్లీ విచారించేందుకు ఈ నెల 19వ తేదీన గుంటూరులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భూమనతో పాటు కాకినాడలో ఉంటున్న ఆయన సన్నిహితుడు మెహర్కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది.
వీరితో పాటు గతంలో విచారణకు హాజరుకాని నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడికి కూడా మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయగా, ఆయన ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications