ఏపీ ప్రభుత్వం తో సంధా- సమరమా : సినిమా ఎగ్జిబిటర్ల కీలక భేటీ- వెనుక ఉన్నదెవరు..!!
ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా ప్రచ్ఛన్న యుద్దం సాగుతోంది. ఇందులో సినిమా టిక్కెట్ల ధర అంశం ఎగ్జిబిటర్లకు సమస్యగా మారుతోంది. దీంతో..తమ కార్యాచరణ ఖరారు చేసేందుకు వారు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం..టాలీవుడ్ పెద్దలు సమావేశమై పరిష్కరించుకోవాల్సిన సమయంలో..ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు. కొందరు టాలీవుడ్ ప్రముఖుల చేతిలోనే అనేక థియేటర్లు ఉన్నాయి. వారి చేతిలో పంపిణీ దారుల వ్యవస్థ ఉంది. ఇక, ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సినిమి టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ జీవో తీసుకొచ్చింది.
Recommended Video

టిక్కెట్ల ధరల తగ్గింపు పైనే చర్చ
సెంటర్ల వారీగా... గ్రామీణ..మున్సిపల్..నగర పాలక సంస్థల వారీగా టిక్కెట్ల ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము భారీగా నష్టపోతామని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన మెగాస్టార్ చిరంజీవి..నాగార్జున..అల్లు అరవింద్ లాంటి వారు ఏపీ ప్రభుత్వాన్ని దీని పైన పునరాలోచన చేయాలని కోరారు. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో..ఎగ్జిబిటర్లు ఇదే అంశం పైన కోర్టుకు వెళ్లారు. గతంలో లాగా భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది.

న్యాయ పోరాటం చేస్తూనే... ప్రభుత్వంతో మాత్రం
పాత ధరలకే టిక్కెట్ల విక్రయాలను అమ్ముకోవటానికి పిటీషనర్లకు అనుమతి ఇచ్చింది. దీని పైన ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. అక్కడ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకోవాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అదే సమయంలో అధిక ధరలకు టిక్కెట్లను విక్రయిస్తున్నారా అంటూ ధియేటర్లలో అనేక ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు గురువారం విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించారు. హైకోర్టులో విచారణ సైతం రేపు బెంచ్ ముందుకు రానుంది.

పెద్ద సినిమాల విడుదలకు ముందే పరిష్కారం కోసం
కోర్టు ఇచ్చే మార్గదర్శకాలు...ఆ తరువాత అనుసరించాల్సిన వ్యూహాల పైన వీరు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రభుత్వంతోనూ ఈ అంశం పైన చర్చించాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నానికి తమ సమస్యలను వివరించారు. తాను సీఎంకు వివరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక, మరి కొద్ది రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు రానున్నాయి. సంక్రాంతి సీజన్ కావటం.. కొత్త సినిమాల విడుదల లోగా సమస్య పరిష్కరించుకోకుంటే తమకు నష్టాలు తప్పవని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.

సీఎం జగన్ అంగీకరించేనా.. కోర్టు తీర్పు తరువాతే
ఇందు కోసం ప్రభుత్వంతో అప్పీల్ చేస్తూనే..తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాల పైన చర్చించనున్నారు. కరోనా సమయంలో తాము భారీగా నష్టపోయామని..తిరిగి నిలదొక్కుకునే సమయంలో టిక్కెట్ల ధరలు తగ్గించటం ద్వారా మరింత నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహం పై చర్చ జరగనున్నట్లు సమాచారం. అందుకోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో డిసైడ్ చేయనున్నారు. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రభుత్వం టిక్కెట్ల విషయంలో పునరాలోచన చేస్తుందా..ఇటువంటి వాటికి కోర్టు తీర్పు తరువాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications