సీజేఐకి ఢిల్లీలో నివాసం - భద్రత : ఆ రోజు భయాందోళన కలిగింది - జస్టిస్ ఎన్వీ రమణ..!!
కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ నిర్ణయించింది. అందులో భాగంగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేని నివాస వసతిని కేంద్రం సమకూర్చనుంది. న్యాయమూర్తితో పాటుగా వారి నివాసాల వద్ద పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏడాదిపాటు 24 గంటల వ్యక్తిగత భద్రతా సౌకర్యం ఏర్పాటు చేయనుంది.
రెండు రోజుల్లో సీజేఐ పదవీ విరమణ
ఈ మేరకు చట్ట సవరణలు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి..న్యాయమూర్తులకు విమానాశ్రయాల్లోని లాంజ్లలో ప్రోటోకాల్ ప్రకారం గౌరవమర్యాదలు అందుతాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. రిటైర్డు సీజేఐకి ఢిల్లీలో ఉచిత టైప్-7 భవన వసతిని పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆరు నెలలపాటు కల్పిస్తారు. వీరి వాహన డ్రైవర్కు ఇతర ఉద్యోగులకు మాదిరిగా పూర్తి వేతనం, ఇతర అలవెన్సులను న్యాయస్థానాల నిధుల నుంచి చెల్లిస్తారు. వీరికి కేటాయించే సెక్రటేరియల్ అసిస్టెంట్ స్థాయి సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీసర్తో సమానంగా ఉంటుంది.
జస్టిస్ ఎన్వీ రమణకు సత్కారం
మరో రెండు రోజుల్లో ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాత సీజేఐ ఢిల్లీలోనే ఉంటారా..లేక, తెలుగు రాష్ట్రాల్లో తన భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్వీ రమణ సీజేఐగా కొనసాగుతూ అనేక న్యాయ శాఖలో ఖాళీల భర్తీతో పాటుగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, సుప్రీం కోర్టు ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కష్టపడి పని చేయటానికి ప్రత్యామ్నాయం లేదని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రధాన న్యాయమూర్తిగా నెలలు.. న్యాయమూర్తిగా 8 ఏళ్ల కాలం అద్బుతంగా సాగిందని చెప్పారు.
ఆ రోజు భయాందోళనలు నెలకొన్నాయంటూ
మరిచిపోలేని అనుభవాలను మిగిల్చిందని చెప్పుకొచ్చారు. ఒకే రోజు 500 మంది ఉద్యోగులు కోరోనా బారిన పడటం భయాందోళనలకు కారణమైందన్నారు. అయినా..ప్రాణాలను పణంగా పెట్టి ఆ సమయంలోనూ విధులు నిర్వహించారని అభినందించారు. న్యాయబద్దమైన సమస్యలన్నీ పరిష్కరించటానికే ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లోనూ మంచి పనులు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు రధచక్రాలు నిరంరతం కొనసాగటంలో ప్రతీ ఒక్కరు సహకరించారని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.