మరోసారి ‘నామాల’ వివాదం: జియ్యాంగార్ల ఆగ్రహం
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి నామాల వివాదం రాజుకుంది. నామాల విషయంలో జియ్యంగార్లు, అర్చకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శ్రీవారి నామాల ఆకృతిని మార్చేశారంటూ జియ్యంగార్లు ఆరోపిస్తున్నారు. శ్రీవారి నామాలు 'యూ' ఆకారంలో ఉండటంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా తాము తోమాల సేవ విధులకు హాజరుకాబోమని టీటీడీకి హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే.. ప్రతీ శుక్రవారం శ్రీవారి మూలవిరాట్ అభిషేక సేవ జరుగుతుంది. రోజటిలాగే ఈ సేవను ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు నిర్వహించారు. అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో స్వామివారికి 'యూ' ఆకారంలో నామాలను తీర్చిదిద్దారు. కాగా, అలంకరణ తర్వాత జియ్యంగార్లు స్వామికి తోమాల సేవ నిర్వహిస్తారు.
ఈ సమయంలో 'యూ' ఆకారంలో ఉన్న నామాలను చూసిన జియ్యంగార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వామి వారికి 'వీ' ఆకారంలో నామాలు పెట్టాల్సి ఉన్నప్పటికీ ఆకృతిని మార్చడం పట్ల ఆలయ డిప్యూటీ ఈవోకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై డిప్యూటీ ఈవోతో వాగ్వాదానికి దిగిన జియ్యంగార్లు తోమాల సేవ విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికితీసుకెళ్లగా శ్రీవారి నామాలు మార్చిన రమణ దీక్షితులుకు నోటీసులు ఇచ్చే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. నిరుడు కూడా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కుమారుడు అభిషేకం నిర్వహించిన సమయంలో శ్రీవారి నామాలను మార్చడంపై జియ్యంగార్లు తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆరు నెలలు పాటు రమదీక్షితులు కుమారుడిని అభిషేక సేవలకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా శుక్రవారం కూడా స్వయంగా ఆలయ ప్రధాన అర్చకులే స్వామివారికి అభిషేక సేవలు నిర్వహించడంతో టీటీడీ తీసుకునే నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తన మనవడిని గర్భగుడిలోకి తీసుకెళ్లిన విషయంలో రమణదీక్షితులుకు టిటిడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు.