ఒంగోలులో ఉద్రిక్తత: కరణం, గొట్టిపాటి వర్గాల ఘర్షణ, రవిపై దాడికి యత్నం
ఒంగోలులో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, ఎమ్మెల్యే గొట్టి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య మంగళవారం తోపులాట చోటు చేసుకుంది.
ప్రకాశం: ఒంగోలులో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, ఎమ్మెల్యే గొట్టి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య మంగళవారం తోపులాట చోటు చేసుకుంది.
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో తలెత్తిన వివాదం ఈ గొడవకు దారితీసింది. కరణం, గొట్టిపాటి వర్గీయులు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
గొట్టిపాటి రవికుమార్ వైపు కరణం వర్గీయులు దూసుకొచ్చారు. దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ్నుంచి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిపోయారు. కాగా, మంత్రులు పరిటాల సునీత, నారాయణ, శిద్ధా రాఘవులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
వేలు చూపుతూ కరణం వెంకటేష్.. రవి చొక్కా చించేయత్నం
మౌనంగానే సమావేశం లోపలికి వెళ్తున్న గొట్టిపాటి రవి చొక్కాను కరణం వర్గీయులు పట్టుకున్నారు. దీంతో ఆయన చొక్కా కొంచెం చినిగింది. అనంతరం వారి నుంచి విడిపించుకున్న గొట్టిపాటి రవి, సమావేశ మందిరంలోనికి వెళ్తూ వెనుదిరిగి చూడగా, కరణం వెంకటేష్ వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ఆయన పక్కనున్న అనుచరుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే మీడియా విజువల్స్ లో గొట్టిపాటి చొక్కాపట్టుకున్నదెవరో స్పష్టంగా తెలియడం లేదు.
ఇటీవల కరణం వర్గీయుల హత్యలు జరిగిన నాటి నుంచి అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. గొట్టిపాటి వర్గీయులే తమ వర్గం వారిని హత్య చేశారని ఇప్పటికే కరణం బలరాం, కరణం వెంకటేష్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే, ఆ హత్యలతో తమకేం సంబంధం లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, గొట్టిపాటి రాకను అప్పుడే కరణం బలరాం గట్టిగా వ్యతిరేకించారు. కానీ, అధిష్టానం మాత్రం గొట్టిపాటిని టీడీపీలో చేర్చుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య మరింత వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.