లోకేష్ తీరు మారట్లేదు: భీమవరంలో రెచ్చగొట్టే ప్రసంగం.. దాడులు: పోలీసులకూ గాయాలు
ఏలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ 205వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ప్రవేశించారు. నారా లోకేష్ పాదయాత్రకు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
భీమవరంలో గనుపూడి సెంటర్లో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా నారా లోకేష్ మరోసారి రెచ్చగొట్టే ప్రసంగానికి పాల్పడ్డారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కబ్జాకోరుగా అభివర్ణించారు. గజదొంగ అంటూ గ్రంధి శ్రీనివాస్ను ఉద్దేశించి సంబోధించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ వదల్లేదు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో దోపిడీలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలను చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడంటూ గతంలో విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోవట్లేదు నారా లోకేష్.
కనీసం డజను కేసులను పెట్టించుకోవాలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలంటూ పదే పదే ప్రసంగించడం టీడీపీ క్యాడర్ను మరింత రెచ్చగొట్టినట్టయింది. వైసీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారు. రోడ్డు పక్కన వైసీపీ జెండాలను పట్టుకుని నిల్చుని నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు, గ్రంధి శ్రీనివాస్ అనుచరులపై రాళ్ల దాడికి దిగారు. రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపైనా రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందే భీమవరంలో వైఎస్ జగన్కు చెందిన భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలను నారా లోకేష్ ఆదేశాల మేరకు చించివేశారు టీడీపీ కార్యకర్తలు. బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేసినందుకు వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. వాటిని మళ్లీ కట్టుకున్నారు. ఇది టీడీపీ నాయకులకు మరింత ఆగ్రహానికి గురి చేసిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications