ఫొటోలు: అసెంబ్లీ సాక్షిగా టిడిపిలో రెండు పంథాలు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం లేదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు అంటున్నారు. అయితే, తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెబుతూనే సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం విభజనను ఆపేయాలని అడుగుతున్నారు. అసెంబ్లీ తీర్మానంతోనే రాష్ట్ర విభజించాలని అడుగుతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఆయన ప్రతిరోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విభజనను ఆపేయాలనే అడుగుతున్నారు. అయితే, సమన్యాయం చేయడం లేదు కాబట్టి చంద్రబాబు విభజనను ఆపాలని అడుగుతూ ఉండవచ్చు.
మరి, సీమాంధ్ర శాసనసభ్యుల మాటేమిటనేది ప్రశ్న. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తామనే వారంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావును శనివారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు వారు సమన్యాయం కోరుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించడం లేదని చెప్పారు.
కానీ, తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుల నోట సమన్యాయం మాటే రావడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను, కాంగ్రెసులోని కొంత మంది సీమాంధ్ర శాసనసభ్యులను మించి వారు సమైక్య నినాదాలు చేస్తున్నారు. తెలుగుదేశం సీమాంధ్ర శానససభ్యులు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు సమైక్యాంధ్ర నినాదాల ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని ప్రదర్శిస్తూనే మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చను ప్రారంభించాలని, వేయి మంది బలిదానాలను వృధా చేయవద్దని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్సించారు. తెలంగాణ బిల్లు రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
పరస్పర నినాదాలతో తెలుగుదేశం సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ప్రదర్శించిన కార్డులు ఒకే రంగులో, ఒకే విధంగా ఉండడం కూడా చూడవచ్చు. కాంగ్రెసు శాసనసభ్యులు కూడా ప్రాంతాలవారీగా విడిపోయి వాదనలు వినిపిస్తున్నారు. అయితే, వారు ప్రాంతాల వారీగా విడిపోయి పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులనే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
కానీ, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులను సమర్థిస్తున్నారు. దీనివల్లనే పరస్పర విరుద్ధమైన ప్లకార్డులను తెలుగుదేశం శాసనసభ్యులు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసులాగా వ్యవహరించి ఉంటే అది చర్చనీయాంశమై ఉండేది కాదు.