నూతన రాజ్భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం.. ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజ్భవన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అక్కడి సీఎం క్యాంపు కార్యాలయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ నివాసం కోసం కొత్త రాజ్భవన్ ఉండాలని ఏపీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో విజయవాడ ఎంజీరోడ్లోని సీఎం క్యాంపు కార్యాలయంను రాజ్భవన్గా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ ఒక్కరే ఉన్నారు. అయితే హైదరాబాదులోని రాజ్భవన్లోనే గవర్నర్ ఉంటున్నారు. నరసింహన్ ఉమ్మడి రాష్ట గవర్నర్గా ఉంటూ అవసరమైనప్పుడు విజయవాడకు వస్తున్నారు. అయితే గవర్నర్ బసచేసేందుకు విజయవాడలో రాజ్భవన్ లేకపోవడంతో ఆయన బసను హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అనవసరపు ఖర్చులు తగ్గించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ బస చేసేందుకు వీలుగా రాజ్భవన్ సిద్ధం చేయాలని భావిస్తోంది.
Recommended Video


నవ్యాంధ్రప్రదేశ్లో పాలన ఏపీ నుంచి సాగించాలని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భావించినప్పుడు అందుకు వీలుగా ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.40 కోట్లు వెచ్చించింది. ఇక తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగే వరకు ఈ క్యాంపు కార్యాలయం నుంచే చంద్రబాబు తన పాలన సాగించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక పరిపాలనను అక్కడికి మార్చారు చంద్రబాబు. అయితే ఖాళీ కావడంతో అదే క్యాంపు కార్యాలయాన్ని రాజ్భవన్గా మార్చాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇది సరిపోదని నాటి గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఇప్పుడు అదే కార్యాలయాన్ని రాజ్భవన్ కోసం పరిశీలిస్తున్నారు అధికారులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్ వస్తారనే వార్తలు ప్రచారంలో ఉండటంతో కొత్త గవర్నర్ వచ్చే సమయానికల్లా రాజ్భవన్ పూర్తిస్థాయిలో ఉండాలని సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications