అమరావతి కేంద్రంగా ప్రతిష్ఠాత్మక సంస్థకు శ్రీకారం - బిగ్ టర్న్..!!
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది. మంగళగిరి లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు అయ్యింది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు. సమస్య కాదు పరిష్కారంపై ఆలోచనలు చేయడం ఉత్తమ విధానమని సీఎం పేర్కొన్నారు.
మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి ప్రారంభించారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రిడ్ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి కేంద్రంగా హబ్, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేసారు. సంపద సృష్టితో పాటు పేదరిక నిర్మూలన ప్రధానమని వివరించారు. ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు రూపొందాలంటే వినూత్న ఆవిష్కరణలు ఎంతో అవసరమని సీఎం చెప్పారు.

ఆవిష్కరణలు వినూత్నంగా, ఉన్నతంగా ఉంటేనే పోటీలో నిలబడగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.

ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఎకో సిస్టం కలిసి పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. వినూత్న నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య, రక్షణ, ఆర్థిక ఇలా అనేక సమస్యల పరిష్కారానికి లక్ష్యాలు నిర్ధేశించుకుని పనిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమస్యల పరిష్కార వేదికగా ఇన్నోవేషన్ హబ్ లు కీలకపాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications