ఎన్నికల్లో పోటీ చేయాలంటే, ఇద్దరు తప్పనిసరి - చంద్రబాబు కొత్త చట్టం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొత్త అర్హత తెర పైకి తీసుకొచ్చారు. ఈ మేరకు చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. రాబోయే రోజు ల్లో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనేవారికే ఇది వర్తిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవారికే అవకాశం దక్కేలా కొత్త చట్టం సిద్దం అవుతోంది.
చంద్రబాబు ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. తాజాగా రాష్ట్రంలో సంపద పెంపు.. పేదరికం నిర్మూలన గురించి వివరించిన చంద్రబాబు.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గటం పైన ఆసక్తికర విశ్లేషణ చేసారు. గతంలో జనాభా పెంపు వద్దని చెప్పే పరిస్థితులు ఉండేవని.. జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహాకాలు ఇచ్చే అవసరం ఉండేదని చంద్రబాబు గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. జనాభా ప్రోత్సహించేలా ఎన్నికల నిర్వహణలో కొత్త చట్టం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

భవిష్యత్ ఇలా
2026 లో ఏపీ జనాభా 5.38 కోట్లు ఉంటుందని అంచనాగా చెప్పారు. అయితే, క్రమేణా మార్పు లు చేసుకుంటూ..2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని పేర్కొన్న చంద్రబాబు ప్రతీ జంటకు 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యం అవుతుందని విశ్లేషించారు. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే వారి కోసం కొత్త చట్టం తెచ్చే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చట్టం ద్వారా కొత్త విధానం ప్రకారం, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేషన్ చైర్మన్, లేదా మేయర్ వంటి పదవులకు పోటీ చేయాలనుకునే వ్యక్తులు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
చట్టం తరువాత
ఒకప్పుడు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతించకూడదనే నిర్ణయం జరిగిందని గుర్తు చేసారు. కానీ, ప్రస్తుతం రూపు దిద్దుకుంటున్న విమానాశ్రయాలు..భారీ రోడ్ల విస్తరణ వంటివి వినియోగానికి జనాభా తగ్గిపోతే ఏంటి ప్రయోజనమని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో, భవిష్యత్ కోసం జనాభా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. సంపద సృష్టి, ఆదాయ వృద్ధి తో పాటుగా జనాభా పెంపు పైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనేవారికే ఇది వర్తిస్తుందని చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications