జగన్ మూలాలపై చంద్రబాబు గురి - తొలి రోజే ఆపరేషన్ షురూ..!!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ రోజు అమరావతి సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు హామీల అమలుకు ముందుగా అయిదు సంతకాలు చేయనున్నారు. చంద్రబాబు తొలి రోజు నుంచే తన మార్క్ నిర్ణయాలను మొదలు పెట్టారు. ఎన్నికల్లో ఓడిన జగన్ మూలాల పైన చంద్రబాబు గురి పెట్టారు. జగన్ పైన పూర్తి పై చేయి సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పలు నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.
చంద్రబాబు లెక్కలు
ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. 40 శాతం వరకు ఓట్లు సాధించింది. సంక్షేమం - సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో కనిపించే వారు. కానీ, జగన్ భారీ ఓటమిని ఏ అంచనాలు అడ్డుకోలేకపోయాయి. అయితే జగన్ కు ఈ ఎన్నికల్లో 1.32 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు భారీ విజయం నమోదు చేసుకున్న చంద్రబాబు..తొలి రోజు నుంచే జగన్ మూలాలు..బలం పైన గురి పెట్టారు. కేబినెట్ కూర్పులోనే తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలను జగన్ తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఈ అంశం పైనే ప్రధానంగా ఫోకస్ చేసారు.

జగన్ మూలాలపై గురి
చంద్రబాబు ముందుగా మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యతిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎం.రాంప్రసాద్రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్ చోటు సంపాదించారు.

భారీ ప్రణాళికలతో ముందుకు
చంద్రబాబు తన మంత్రివర్గంలో సీనియర్లు -యువతకు ప్రాధాన్యత కల్పించారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించటంతో..సాధారణంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు కనిపించే ప్రాధాన్యతకు భిన్నంగా ఈ సారి మంత్రివర్గ కూర్పు జరిగింది. పక్కా ప్రణాళికా బద్దంగా జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక జరిగినట్లు స్పష్టం అవుతోంది. క్రిష్టా జిల్లాలోనూ చంద్రబాబు మంత్రివర్గ లెక్కలు సొంత పార్టీ నేతలకే అంతు చిక్కటం లేదు. అయితే..రానున్న అయిదేళ్ల కాలంలో పాలనలో - పార్టీ పరంగానూ వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోని నెడుతూ..జగన్ ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు ఖాయంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications