ప్రధానితో చంద్రబాబు భేటీ, నితీశ్ "హోదా" మెలిక వేళ - కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు అధికారికంగా రాష్ట్ర అంశాల పైన ప్రధానితో భేటీ కానున్నారు. ఏపీకి కేంద్రం సాయం పైన చర్చించనున్నారు. అటు బీహార్ సీఎం నితీశ్ తమకు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రధానితో జరిగే ఈ భేటీలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 4వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చించే నిమిత్తం ఆయన వెళ్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు. ఆర్థికంగా ఒడిదొడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చిస్తారు.

ప్రధాని తో భేటీ
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్కు ఒక రూపం ఇవ్వవచ్చన్న అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీశ్ తాజాగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ జేడీయూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసారు. ఇప్పటికే ఏపీకి సంబంధించి హోదా అంశం పెండింగ్ లో ఉంది. ఏపీలో అమరావతి నిర్మాణం .. పోలవరం ప్రాధాన్యత అంశాలుగా చంద్రబాబు భావిస్తున్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీ పైన చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర సహకారం
ఏపీలో జూలై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సి ఉంది. కేంద్రం నుంచి చంద్రబాబు సాయం కోరుతున్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి చంద్రబాబు వివరించనున్నారు. ఇక..అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు పైన చర్చిస్తారని సమాచారం. అవసరమైతే ఆయన మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశముంది. దీంతో..ఈ పర్యటనలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications