ఏపీ అప్పు ఎంత, చంద్రబాబు - జగన్ లెక్కల్లో ఏది నిజం..!!
ఏపీలో అప్పుల లెక్క పై భిన్నమైన అంకెలు బయటకు వస్తున్నాయి. రాష్ట్ర రుణభారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసారు. ఇటు మాజీ సీఎం జగన్ తన హయాంలో చేసిన అప్పుల వివరాలతో పాటుగా రాష్ట్రం అప్పు గురించి లెక్కలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పది లక్షలకోట్ల అప్పుల్లో ఉందని ప్రస్తావించారు. ఇంతకీ ఏపీ అప్పు ఎంత. ఎవరి లెక్కలు నిజం అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది.
ఏపీ రుణభారం
ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం రూ 13 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చంద్రబాబు, పవన్ ప్రచారం చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేసారు. గత ఐదేళ్లలో రూ.9.74 లక్షల కోట్ల రుణ భారం పెరిగిందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని, స్థానిక సంస్థల నిధులనూ మళ్లించారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థ నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయన్నారు. తలసరి అప్పు రూ.1.44లక్షలుగా ఉందని చెప్పారు.

చంద్రబాబు - జగన్ లెక్కలు
ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అప్పుల లెక్కలను వివరించారు. రాష్ట్ర విభజన నాటికి ఉన్నఅన్ని రకాల అప్పు రూ 1,53,347 కోట్లుగా చెప్పారు. చంద్రబాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అన్ని రకాలుగా తీసుకున్న అప్పు రూ 4,08,710 కోట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు చూస్తే.. అవి 7,48,000 కోట్లుగా జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం 21.63గా ఉండగా..తన పాలనలో అది 12.90 శాతం మాత్రమేనని వివరించారు. గవర్నర్ ప్రసంగంలోనూ అసత్యాలు చెప్పించారని ఆరోపించారు.
ఏపీ అప్పుల లెక్కతో
ఇప్పుడు ఇదే చర్చ సామాన్యుల్లోనూ మొదలైంది. జగన్ రాష్ట్ర అప్పు రూ 7.48లక్షల కోట్లుగా చెబుతుంటే..చంద్రబాబు రూ 9.74 లక్షల కోట్లుగా చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో రూ 13 లక్షల కోట్లు అప్పు ఉందని చేసిన ప్రచారానికి ఈ లెక్క భిన్నంగా ఉంది. జగన్ కేంద్ర ఆర్దిక సంస్థలు చెప్పిన లెక్కలను ప్రస్తావిస్తూ అప్పుల చిట్టాన వివరించారు. పథకాల అమలు నుంచి ఆర్దిక కారణాలు చెప్పి తప్పించుకొనేందుకే అప్పు పై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో..ఏపీ అప్పుల భారం ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రూ 13 లక్షల కోట్లు కాదనేది స్పస్టత వచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications