కేంద్రం తీరు...రాష్ట్రానికి తీవ్ర ప్రమాదం:సిఎం చంద్రబాబు ఆందోళన
Recommended Video
అమరావతి:కేంద్రానికి ఇంగితజ్ఞానం లేకుండా పోతోందని, హోదా విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ రాష్ట్రానికి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని సిఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎపికి ప్రత్యేక హోదాపై సుప్రీం కోర్టుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన వెంటనే ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ అఫిడవిట్లో కేంద్రం పేర్కొన్న అంశాలపై చర్చించారు. కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది.
కేంద్రం తీరు...ఇబ్బందికరం
ఎపికి ప్రత్యేక హోదా కేంద్రం అనుసరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో అన్నారు. కేంద్రం ఏకపక్ష తీరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన తరువాత లోటు బడ్జెట్ తో,అప్పులతోఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సింది పోయి ఇలా ఇబ్బందులు పాల్జేయడం ఎంతవరకు సమంజసమని సిఎం చంద్రబాబు మంత్రుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
పరిగణనలోకి...తీసుకోలేదు
రుణమాఫి, పెన్షన్లను పరిగణనలోకి తీసుకోలేదని, రాజధాని విషయంలోనూ ఘోరంగా వ్యవహరించారని సిఎం చంద్రబాబు వివరించారు. క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ఒక కన్వెన్షన్ సెంటర్కు ఇచ్చినంత నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. వెనుకబడిన జిల్లా లకు రూ.1050 కోట్లు ఇచ్చామని కేంద్రమే చెబుతోందని, ఇది ఎలా సరిపోతుందని సిఎం వ్యాఖ్యానించారు.
హక్కులను...కాలరాస్తోంది
ఏపీ హక్కులను కేంద్రం కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రెవెన్యూలోటు కింద రూ.3900 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, స్టాండరైజ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటో కేంద్రం చెప్పాలని డిమాండ్చేశారు. ఇప్పటికీ ఉద్యోగుల విభ జన, అప్పుల సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. పోలవరం విషయంలో పునారావాస ప్యాకేజీ గురించి ఎక్కడా చెప్పలేదని తెలిపారు. అయినా అన్ని హామీలు నెరవేర్చామని చెప్పడం దారుణమని అన్నారు.
మంత్రులతో చర్చించి...కార్యచరణ ప్రణాళిక
ఎపికి సంబంధించి అన్ని హామీలు నెరవేర్చామని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మరోసారి మంత్రి మండలిలో చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ వెల్లడించారు.