బీసీల జీవితాల్లో వెలుగులు.. కేంద్రపథకంపై రాష్ట్రం రాయితీ; సీఎం చంద్రబాబు ప్రకటన!
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలకు గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ వెలుగులు నింపే ప్రయత్నంలో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తే కేంద్రం ఇచ్చే రాయితీ తో పాటు, బీసీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
బీసీలకు అదనపు రాయితీ ప్రకటించిన చంద్రబాబు
రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుండగా, కేంద్రం 60 వేల వరకు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో 20 వేల అదనంగా ఇస్తామని ప్రకటించారు. బీసీలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు రెండు కిలోవాట్ల వరకు ఉచితంగా
ఇక ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు రెండు కిలోవాట్ల వరకు ఉచితంగా అందిస్తున్నామని, ఇతరులకు ఒక కిలోవాట్ కు 30 వేల రూపాయలు, రెండు కిలోవాట్లకు 60 వేల రూపాయలు, మూడు కిలోవాట్లకు 78,000 రాయితీ ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన డబ్బు వారు నేరుగా పెట్టుకోవాలని దానికి ప్రభుత్వం నుండి కానీ బ్యాంకు నుండి కానీ రుణం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి తీసుకుంటే 9ఏళ్లలో 9.5% వడ్డీతో తిరిగి చెల్లించాలన్నారు.
ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగించిన చంద్రబాబు
రాష్ట్రంలో సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ వినియోగం తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే తాము అందించిన బంపర్ ఆఫర్ ను ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా చూడడానికి ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల ఇళ్ల పైన సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు బాధ్యత ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
సోలార్ విద్యుత్ వెలుగులతో పాటు ఆదాయం కూడా
సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా 1559 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఆస్కారం ఉందని చంద్రబాబు అన్నారు. మొత్తం 8937 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టులో కేంద్రం నుండి 4663 కోట్లు, రాష్ట్రం నుంచి 4274 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుంటే గృహ అవసరాల కోసం వినియోగదారులు విద్యుత్ ను వాడుకోవడమే కాకుండా, ఉత్పత్తి చేసిన విద్యుత్ గ్రిడ్ కు విక్రయించే ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications