రాయలసీమకు భారీ శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు?
ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తోంది. కొద్దిరోజుల నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అవసరమైన స్థలాలతోపాటు రాయితీలు కూడా ఇస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు వారి హామీ ఇస్తున్నారు. తాజాగా విద్యుత్తు వాహనాలు, బ్యాటరీలు తయారుచేసే విన్ ఫాస్ట్ కంపెనీ(వియత్నాం) ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.
చంద్రబాబును కలిసిన విన్ ఫాస్ట్ ప్రతినిధులు
ఈవీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. కంపెనీకి అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్నివిధాలా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలందిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. విద్యుత్తు వాహనాల తయారీలో ఎంతో పేరుగాంచిన విన్ ఫాస్ట్ ఏపీకి రావాలని, యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. రాయితీలపై కంపెనీ చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని, అంతా సానుకూలంగా ఉంటే రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నెలరోజుల్లోపు ప్రకటిస్తామని చెప్పినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.

రాయలసీమలోనే..
విన్ ఫాస్ట్ కంపెనీకి అవసరమైన భూమి రాయలసీమలో ఉందని, అక్కడ కంపెనీని ఏర్పాటు చేస్తే భూమిని ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి భరత్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయంగా పేరుగడించిన కియా సంస్థ అనంతపురంలో కంపెనీని నెలకొల్పిందని, ఇప్పుడు విద్యుత్తు వాహనాలు, బ్యాటరీ తయారీకి చెందిన విన్ ఫాస్ట్ కూడా రాయలసీమకు వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందనే అభిప్రాయాలను పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు కూడా రెండురోజుల క్రితం రాష్ట్రంలో రూ.60వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం దగ్గర దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications