15వ ఆర్థిక సంఘంతో సిఎం చంద్రబాబు సమావేశం...వారి సమక్షంలోనే కేంద్రంపై విమర్శల వర్షం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన 15వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్, ఇతర సభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు.
అలాగే ఈ సమావేశంలో ఎపి ప్రభుత్వం తరుపున సిఎం చంద్రబాబుతో పాటు మంత్రిమండలిలో ముఖ్యులు, సీఎస్, డీజీపీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై సమావేశంలో చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎపి పట్ల వివక్ష చూపుతోందని సిఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.
15 వ ఆర్థిక సంఘం...సిఎం భేటి
అనంతరం సమావేశంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివక్షతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రంగా మారిందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా....ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
అయినా...అమలు
అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని సిఎం చంద్రబాబు చెప్పారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా తమ కృషి సాగుతోందని వెల్లడించారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం కేంద్రానికి మంచిది కాదని సిఎం చంద్రబాబు హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని ఆయన కోరారు.
ఆ లెక్కలే...ప్రాతిపదిక కావాలి
ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్లో మెట్రోలకు భారీ నిధులు సమకూర్చారని తెలిపారు...కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం మోకాలడ్డుతున్నారని కేంద్రం తీరును దుయ్యబట్టారు. గతంలో నయా రాయపూర్కు కేంద్రం రూ.4500 కోట్ల సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సమగ్ర...నివేదిక
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కనీసం రూ.9,000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫార్సు చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి మాటమార్చిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సమావేశం అనంతరం రాష్ట్రానికి రావాల్సిన పన్నుల్లో వాటా, ఇతర అంశాలపై 15 వ ఆర్థిక సంఘానికి సవివరమైన 180 పేజీల నివేదికను వారికి అందించనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video