చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసిన నారా లోకేష్
Chandrababu Naidu: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.

పింఛన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు ఓ లబ్దిదారుడి గుడిసెకు వెళ్లారు. కుటుంబ సభ్యులను పలకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారని ఆరా తీశారు. వారి వివరాలను తెలుసుకున్నారు.
ఇంకా బాగా చదవాలంటూ ప్రోత్సహించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని హితవు పలికారు చంద్రబాబు. కూలిపనులు చేసుకుంటూ చదివిస్తోన్నారని, క్లాస్లో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. ఆర్థికంగా ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని చంద్రబాబు ఆ లబ్దిదారుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని, ఇంకా ఎక్కువ కష్టపడి అదనపు ఆదాయాన్ని పొందాలంటూ లబ్దిదారుడికి సూచించారు. పక్కా ఇంటిని మంజూరు చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు.. అంటూ నారా లోకేష్ను ప్రశంసించారు.
పెనుమాక ఎస్టీ కాలనీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి, స్థానిక ప్రజల అభివాదం. దగ్గరుండి తన నియోజకవర్గ ప్రజలని ముఖ్యమంత్రికి పరిచయం చేసిన నారా లోకేష్ గారు.#PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/9lOKSIvdFT
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
పెనుమాక- నారా లోకేష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంగళగిరి అసెంబ్లీ పరిధిలోకి వస్తుందనే విషయం తెలిసిందే. ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొత్తం ఆయన పర్యవేక్షణలోనే సాగింది. ఇది గ్రాండ్ సక్సెస్ కావడం చంద్రబాబులో ఉత్సాహాన్ని నింపినట్టయింది.
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. పింఛన్ కింద గత ప్రభుత్వం 3,000 రూపాయలను చెల్లించగా.. ప్రస్తుతం ఈ మొత్తం 4,000 రూపాయలకు చేరింది.












Click it and Unblock the Notifications