కేబుల్ కారు పైన మనసుపడ్డ చంద్రబాబు, ఏపీకి తీసుకొచ్చే యోచన
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం కజకిస్థాన్ రాజధాని నగరం అల్మాటిలో పర్యటించింది. నగరానికి దగ్గర్లోని కోక్ - టోబ్ పర్యాటక ప్రాంతానికి కేబుల్ కారులో చంద్రబాబు ప్రయాణించారు. ఇదే తరహా ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపించారు.
ఓ పర్వతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన వైనాన్ని ప్రశంసించారు. ఇక్కడి పర్యాటక ఆకర్షణలను స్వయంగా పరిశీలించారు. ఏపీలో కేబుల్ కారు ప్రాజెక్టుకు అరకు, తిరుపతి వంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వ్యయంపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నగరం నడి మధ్య నుంచి వెళుతున్న కేబుల్కారు సీఎంను ఆకట్టుకుందని చెప్పారు. కోక్ - టోబ్ తరహాలో ఏపీలో ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

అమరావతిపై...
అమరావతి నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు చేయదల్చుకోలేదని, ఇటీవలి కాలంలో నిర్మితమైన రాజధాని నగరాల్లో ఆస్తానా అద్భుతమైన నగరమని, మీ రాజధాని నిర్మాణంలో జరిగిన తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని మీ అనుభవం మాకు ఎంతో అవసరమని, అమరావతిలో పర్యటించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కజకిస్థాన్ రక్షణ మంత్రి తస్మాగమ్ బెతోవ్ను కోరారు.
కజకిస్థాన్, రష్యా పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం బృందం కజకిస్థాన్లో పర్యటించింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందానికి కజకిస్థాన్లో సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది.
జపాన్, దుబాయ్, సింగపూర్ ఆర్కిటెక్టులనే కాకుండా తమ దేశ ఆర్కిటెక్కులను కూడా పిలిపించుకోవాలని, వారి అనుభవాలు అమరావతి నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయని కజకిస్థాన్ మంత్రి బెతోవ్.. చంద్రబాబుకు సూచించారు.
తమ రాజధాని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని, అది పద్దెనిమిదేళ్ల క్రితం నాటి మాటన్నారు. ఇప్పుడు సాంకేతికత పెరిగిందని అమరావతిని అయిదు నుంచి ఏడేళ్లలో నిర్మించుకోగలరనే నమ్మకముందన్నారు. కొత్త నగరానికి సరైన ప్రణాళికతో కూడిన రవాణా వ్యవస్థ కీలకమని, అమరావతిలో ప్రజారవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలన్నారు.












Click it and Unblock the Notifications