భారత్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ తాజా నిర్ణయం ప్రకారం.. విదేశీ ఫోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టే పెట్టుబడులపై లాభాల పన్నును పూర్తిగా రద్దు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. విదేశీ పెట్టుబడిదారులు 12 నెలల కంటే ఎక్కువకాలం పాటు బాండ్లు లేదా లిస్టెడ్ షేర్లను కలిగి ఉంటే.. వాటిపై లభించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కింద 12.5 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీపై 20 శాతం విత్హోల్డింగ్ పన్ను (Withholding Tax) కూడా విధిస్తున్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ పన్నుపై ఇస్తూ వచ్చిన 5 శాతం రాయితీని రద్దు చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs), ఎఫ్పీఐలు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల భారీ నిధులను వెనక్కి తీసుకోవడంతో, మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని తగ్గించడానికి పన్నుల తగ్గింపు లేదా రద్దు అవసరమనే డిమాండ్ గట్టిగా వినిపించింది.

గత కద్ది కాలంగా భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వేగంగా బయటకు వెళ్లిపోవడానికి ఈ భారీ పన్ను నిబంధనలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, గడిచిన 2025 సంవత్సరంలో దాదాపు 8 నెలల పాటు విదేశీ పెట్టుబడిదారులు అమ్మకందారులుగానే మిగిలిపోయారు. కేవలం 2026 జనవరి నెలలోనే రూ. 33,598 కోట్ల నిధులు భారత్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. సింగపూర్, హాంగ్కాంగ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలు విదేశీ పెట్టుబడిదారులపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ పన్నును విధించవు. కానీ భారత్ మాత్రం ఇక్కడి ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వసూలు చేయాలనే విధానాన్ని పాటిస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పెన్షన్ ఫండ్లు, సావరిన్ వెల్త్ ఫండ్స్ వంటి భారీ నిధుల సంస్థలకు భారత్లో పెట్టుబడులు పెట్టడం ఇతర దేశాలతో పోలిస్తే ఖరీదైనదిగా మారింది.
ఈ పన్ను రద్దు నిర్ణయం విదేశీ పెట్టుబడుదారులలో నమ్మకాన్ని పెంచడమే కాకుండా విదేశీ మారక నిల్వలను పెంచేందుకు ఎంతగానో దోహదపడనుంది మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పెట్టుబడిదారులతో చర్చించి, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నుల తగ్గింపుపై వారి సూచనలను వినడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2024 జులై బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ)ను 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులను తట్టుకోవడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్లను తిరిగి భారత్ వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ముందుముందు మరిన్ని కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications