ఇదీ జరిగింది: పడవ మునకపై అసెంబ్లీలో బాబు ప్రకటన, ఆ ఇద్దరికి ప్రశంస
విజయవాడలో పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అక్కడే ఉన్న స్థానికులు పలువురిని కాపాడారని చెప్పారు. ఓ స్థానికుడు 9మందిని కాపాడారని తెలిపారు.
Recommended Video
అమరావతి: విజయవాడలో పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అక్కడే ఉన్న స్థానికులు పలువురిని కాపాడారని చెప్పారు. ఓ స్థానికుడు 9మందిని కాపాడారని తెలిపారు.
దేవుడా! ఒక్కసారి బతికించు: బోటు ప్రమాదం చివరి నిమిషంలో, సీపీఐ నారాయణ సోదరి మృతి
బోటులో 41 మంది, రివర్ బోటింగ్ సంస్థపై కేసు
బోటులో మొత్తం 41 మంది ప్రయాణించారని చంద్రబాబు చెప్పారు. స్థానికులు, సిబ్బంది వెంటనే వెళ్లి 14 మందిని కాపాడారని తెలిపారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. రివర్ బోటింగ్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొండల్రావు, గేదెల శ్రీను, విజయసారథి, చిట్టిబాబు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
పడవ ప్రమాదం దురదృష్టకరం
పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఇరవై మంది మృతి చెందారని, ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇద్దరి ఆచూకీ గుర్తించాల్సి ఉందన్నారు. ఇద్దరు బోటు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
బోటుకు అనుమతి లేదు, డ్రైవర్కు అనుభవం లేదు
రివర్ బోటింగ్ సంస్థ బాధ్యతారాహిత్యం వల్ల ప్రమాదం జరిగిందని చంద్రబాబు చెప్పారు. బోటుకు అనుమతి లేదని చెప్పారు. డ్రైవర్కు అనుభవం కూడా లేదని చెప్పారు. టూరిజం అధికారులు చెప్పినా బోటును నడిపారన్నారు. కుదుపులకు లోను కావడంతో అందరు ఒకవైపు వచ్చారని, దీంతో బోటు తిరగబడిందన్నారు.
రూ.10 లక్షల ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. పడవ ప్రమాదం సమయంలో ఇద్దరు స్థానికులు పర్యాటకులను కాపాడారని చంద్రబాబు అన్నారు. పిచ్చయ్య, శివయ్యలు చాలామందిని కాపాడారని అభినందించారు.
మౌనం పాటించిన అసెంబ్లీ
నవంబర్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీవ్ర విచారాన్ని తెలియజేసింది. అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమైనదని పేర్కొంది. శాసన సభ ఈ దుర్ఘటనలో మృతిచెందినవారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించింది.