శివాజీతో చెప్పిస్తాం, నాపై ఐటీ దాడులు చేస్తారు, జగన్పై దాడితో ఇదీ ప్లాన్: బాబు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని, నటుడు శివాజీ చెప్పినట్లుగానే అంతా జరుగుతోందని, ఏపీలో ఇటీవల ఐటీ దాడులు జరిగాయని, రేపో మాపో తన పైన కూడా జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని, ఈ విషయం తనకు తెలుసునని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
మోడీ ప్రభుత్వం మీడియాను కూడా వదిలి పెట్టడం లేదని, ఎన్డీటీవీపై దాడులు జరిగాయన్నారు. తాను బీజేపీ దాడులకు భయపడితే దేశానికి ద్రోహం చేసినట్లే అవుతుందని చెప్పారు. తనకు దేశమే ముఖ్యమని, ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుందన్నారు.
శివాజీతో ఆపరేషన్ చెప్పిస్తాం
ఆపరేషన్ గరుడకు సంబంధించిన సమాచారం ఎలా వచ్చిందన్న సమాచారాన్ని హీరో శివాజీ నుంచి న్యాయబద్ధంగా కనుక్కోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు. తాను నలభై ఏళ్ల పాటు ఎంతో కష్టపడి వ్యక్తిత్వాన్ని, విశ్వసనీయతను, విజ్ఞానాన్ని సంపాదించుకున్నానని చెప్పారు. తనను అంతమొందించే హక్కు వారికి లేదన్నారు. ఏక పార్టీ పాలనతో లాభం లేదన్నారు. తాము ఎన్డీయేలో ఉన్నంతకాలం ఐటీ ఎగవేత కనిపించలేదని, బయటకు వచ్చాక కనిపిస్తోందన్నారు.
Recommended Video
ఇలా అందరితో కలవడం నాకు కొత్త కాదు
ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వ్యవస్థలు కుప్పకూలాయని చంద్రబాబు అన్నారు. తాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకించడం లేదని, పథకాలు మంచివే అయినా సరిగా అమలు కావడం లేదనేది తమ వాదన అన్నారు. అందుకే ప్రతిపక్ష నేతలను కలిసి అందరినీ ఏకం చేస్తున్నామని చెప్పారు. తాను భిన్న మిత్రపక్షాలను కలుస్తున్నానని చెప్పారు. ఇది తనకు కొత్త కాదన్నారు.
నేనో చిన్న వ్యక్తిని తెలుసు
గతంలో యూఎఫ్, ఎన్ఎఫ్, ఎన్డీయే ప్రభుత్వాలకు మద్దతిచ్చి ఈ దేశాభివృద్ధిలో మావంతు పాత్ర పోషించామని చంద్రబాబు చెప్పారు. తాను చిన్న వ్యక్తిని అని, 545 లోకసభ స్థానాలున్న దేశంలో కేవలం 25 స్థానాలున్న రాష్ట్రంలోని ప్రాంతీయపార్టీకి నేతృత్వం వహిస్తున్న విషయం తనకు తెలుసునని, అదే సమయంలో ఈ దేశాన్ని రక్షించడంలో తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, అదే నా మిషన్ అని, భావసారూప్య పార్టీలతో దీనిపై మాట్లాడి ఏకాభిప్రాయం సాధించి కలిసి పని చేస్తామని చెప్పారు. మోడీకి వ్యతిరేకంగా అందరినీ కూడగడతామన్నారు.
ఫ్రంట్లపై చంద్రబాబు
ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నో ఫ్రంట్లు ఏర్పడ్డాయని చంద్రబాబు చెప్పారు. కానీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రంట్లు చాలా ఏర్పడ్డాయన్నారు. దేశంలో ప్రయోగాలు కేవలం నాలుగైదుసార్లే జరిగాయన్నారు. అందులో తొలుత అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడి జనతా ప్రభుత్వం ఏర్పడిందని, దాని తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో జతకట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ఫ్రంట్ ఏర్పడిందని, యునైటెడ్ ఫ్రంట్ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిందన్నారు. దానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు పలికిందన్నారు. స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మూడో ఫ్రంట్ ప్రభుత్వం అదొక్కటే అన్నారు. దాని తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్డీయే, బీజేపీకి వ్యతిరేకంగా యూపీయే ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. చాలా ఏళ్ల తర్వాత 2014లో మోడీస్పష్టమైన మెజార్టీ సాధించారని, కానీ దేశానికి చాలా కీడు జరిగిందన్నారు. జాతీయపార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు సాధ్యంకాదని, ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాల్సి ఉందని, ఈ దేశ ప్రయోజనాలపై ఆసక్తి ఉన్నవారంతా చేతులు కలిపి ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు. పలు సంకీర్ణ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయని, దేశం ముందు స్పష్టమైన విధానాలున్నాయని, వాటిని నష్టపరచకపోతే చాలని, కానీ ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందన్నారు. నాయకుడు మంచివాడైతే సంకీర్ణంలోను మంచి జరుగుతుందని చెప్పారు.
జగన్ విషయంలో గవర్నర్ అలా చేశారు
తమిళనాడులో శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధమైన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పులేదని, త్వరలో తీర్పు రానుందని గవర్నర్ ఆమెకు అనుమతి నిరాకరించారని, జడ్జిమెంట్ వచ్చాక ఆమె జైలుకు వెళ్లారని, గవర్నర్ ఇలా అడ్డుకోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. తమ గవర్నర్ (నరసింహన్) కూడా జగన్ విషయంలో డీజీపీకి ఫోన్ చేసి సమాచారం అడిగారని, ఆయన తమని నివేదిక అడగాలి తప్ప నేరుగా అధికారులతో మాట్లాడరాదని చెప్పారు. అందరూ ఫోన్లో మాట్లాడుతూ పోతే ప్రజాప్రతినిధులు ఎందుకన్నారు.
జగన్పై దాడికి నేను ఎలా కారణం
జగన్ పైన దాడి గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఆ ఘటన కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో జరిగిందని, దాడి చేసిన వ్యక్తి తాను జగన్ వీరాభిమానని అంటున్నాడని, దాడికి గురయ్యారన్న సానుభూతితో జగన్ ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే తాను దాడి చేసినట్లు చెప్పాడని, అలాంటప్పుడు తనను నిందించడం ఏమిటని చంద్రబాబు అన్నారు. ఆ ఘటన కారణంగా హింస చెలరేగితే శాంతిభద్రతలను కాపాడటంలో తాను విఫలమయ్యానని చెప్పి కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుందని, ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని భావిస్తోందని, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రమే నడుపుతోందని, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ మెజార్టీ లేని బీజేపీ అధికారం ఏర్పాటు చేయడానికి గవర్నర్ను అడ్డుపెట్టుకొందని, తర్వాత సంఖ్యాబలం లేక అది కూలిపోయిందని, ప్రతిచోటా కేంద్రం అలాగే వ్యవహరిస్తోందని, విలువలను గాలికి వదిలేసిందన్నారు.