విజయవాడ కీర్తి కిరీటంలో గిన్నిస్ రికార్డ్
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'విజయవాడ దసరా కార్నివాల్-2025' ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించి, ప్రపంచ పటంలో బెజవాడ పేరును మారుమోగించింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఉత్సవాల్లో, అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకేచోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ చారిత్రక ఘనతను సాధించారు.
ఈ రికార్డు సృష్టికి మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన భారీ కార్నివాల్ ర్యాలీ వేదికైంది. ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఈ ఘనతను అధికారికంగా ధృవపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సర్టిఫికెట్ను అందజేశారు.

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా సాగిన ఈ ర్యాలీలో, సుమారు 3 వేల మంది కళాకారులు పాల్గొన్నారు. వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ జానపద కళారూపాలు, సంప్రదాయ వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలతో విజయవాడ వీధులకు కొత్త శోభను తీసుకొచ్చారు. అమ్మవారి ఊరేగింపు రథం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు, 'విజయవాడ ఉత్సవ్' జెండా ఊపి కార్నివాల్ను ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా అక్కడే కూర్చుని 40 కళాబృందాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనానికి , ప్రభుత్వ ఆశయాలకు నిదర్శనమని కితాబిచ్చారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మైసూరు దసరా తరహాలో అమరావతికి మణిహారంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జ్వరం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని ఆయన తెలిపారు. ఈ చారిత్రక విజయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. అభివృద్ధికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్శన మరోసారి వెల్లడించింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారం తో ఈ ఉత్సవాలు జరిగాయి.












Click it and Unblock the Notifications