నో కాంప్రమైజ్- ఈ మూడు ప్రధాన డిమాండ్లపై: కేంద్రానికి అల్టిమేటం
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి ఆయన ఎలుగెత్తారు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా యువతపై దాడి చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న ఏ ఒక్క శక్తి కూడా విద్యార్థుల గొంతును నొక్కలేదని, యువత ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, భద్రత కోసం ఎంతవరకైనా పోరాడతామని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆయనను వెనకేసుకురావడం సరికాదని హితవు పలికారు. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ నుండి తప్పించి, మరో శాఖకు బదిలీ చేసే ఆలోచన జరుగుతోందని సమాచారం ఉందని, దీన్ని విద్యార్థులు గానీ, ప్రతిపక్షాలు గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోవని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆందోళనలు చేస్తోన్న విద్యార్థుల తరఫున మూడు కీలక డిమాండ్లను ప్రతిపాదిస్తున్నామని, వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేదా రాజీపడే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ అన్నారు. అందులో మొదటిది.. ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే పదవి నుంచి తొలగించడమేనని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేయడానికి, నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా మారారని విమర్శించారు.
ఈ వ్యవహారంలో ఆయనను వేరే శాఖకు మార్చే చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి శాశ్వతంగా తొలగించడమే ఏకైక మార్గమని అన్నారు. దేశానికి అత్యంత విలువైన వనరులైన విద్యార్థుల ప్రయోజనాలను, వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడటంలో కేంద్ర విద్యాశాఖ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
Students' demands are non-negotiable.
— Congress (@INCIndia) July 25, 2026
First: The corrupt and incompetent Education Minister has to be sacked.
🔹There is some talk going on within the Modi government's Cabinet about moving Mr. Pradhan to another ministry. This is not acceptable to the students of India, and it… pic.twitter.com/chIGe7D7wv
తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా వీధుల్లోకి వస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొంటోన్న వేలాది మంది యువతపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీలు చేస్తున్నారని, దీని వల్ల అనేక మంది కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తలలు పగిలాయని ఆరోపించారు. ప్రభుత్వ దమనకాండ యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని అన్నారు.
పోలీసుల అణచివేత చర్యల వల్ల ఒక యువతి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. నిరసనలో పాల్గొన్న ఓ యువకుడి కంటికి పెల్లెట్ బుల్లెట్ తగిలి తీవ్రమైన గాయమైందని, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం ప్రాణాలకు సైతం తెగించి ఆందోళన జరపాల్సిన దుస్థితి నేడు దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications