సీఎం జగన్ భారీ విందు: 13 టేబుళ్లు..ఒక్కో టేబుల్ లో వారంతా : అసలు అజెండా అదే..!
ముఖ్యమంత్రి జగన్ భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 17న ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం సీఎం ఈ విందు ఏర్పాటు చేసారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ విందులో ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేకంగా 13 జిల్లాలకు ఒక్కో టేబుల్ చొప్పున 13 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఆ జిల్లాకు చెందిన వారంతా ఉంటారు. వారి మధ్య సమన్వయంతో పాటుగా..టీంగా ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వారిని సంసిద్దులను చేయటమే లక్ష్యంగా సీఎం ఈ విందు ద్వారా సందేశం ఇవ్వనున్నారు. అయితే, అసలు విందు వెనుక అసలు అజెండా మాత్రం..ఇదే నంటూ ఒక ఆసక్తి కర చర్చ మొదలైంది.
17న సీఎం ప్రత్యేక విందు..
అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని బరం పార్క్లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నఅధికారులు చెబుతున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు..ముఖ్యమంత్రి ఈ భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు..అధికారులతో ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు.
13 జిల్లాలు..13 టేబుళ్లు..వారంతా అక్కడికే
ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్న విందులో 13 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ టేబుళ్ల వద్ద జిల్లా కలెక్టర్..ఎస్పీతో పాటుగా జిల్లా మంత్రులు..ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతీ టేబుల్ వద్ద ముఖ్యమంత్రి పది నిమిషాల సమయం గడపనున్నారు. ఆ సమయంలో ప్రధానంగా జిల్లాలో తాను గుర్తించిన సమస్యలతో పాటుగా...తన వద్దకు వచ్చిన అంశాల పైన జగన్ నేరుగా వారితో చర్చించనున్నారు. అదే విధంగా..ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటంలో వారి మధ్య సమన్వయం సాధించే దిశగా..ప్రజా ప్రతినిధులు ..అధికారుల మధ్య తన సమక్షంలో నే కలిపి కూర్చోబెట్టటం ద్వారా మరింత సమిష్టిగా పని చేయించటమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
స్థానిక ఎన్నికల ముందు..స్పెషల్ డిషెస్ తో..
ఇక..స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులను...పార్టీ నేతలను సమాయత్తం చేసే దిశగా ఈ విందు కొనసాగనుంది. ఇప్పటికే సీఎం ఇచ్చే విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు కమిషనర్ లు కూడా హాజరు కానున్నారు. ప్రతీ జిల్లాకు సంబంధించి సీఎం జగన్ పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారని, వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడుగుతారని తెలుస్తోంది. ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌతిండియన్ వంటలను వండి వడ్డిస్తారని నిర్వహకులు చెబుతున్నారు. అధికారులను..ప్రజా ప్రతినిధులను ఒకే చోటకు తీసుకొచ్చి..వారికి విందు ఇచ్చి మరీ..వారికి దిశా నిర్దేశం చేయటం ద్వారా సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు.