ఏపీలో పోలింగ్ డేట్స్ పై ఢిల్లీ సంకేతాలు - జగన్ అలర్ట్, ఆట మొదలు...!!
షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.మూడు రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహం మీదున్న బీజేపీ.. లోక్సభ ఎన్నికలకు తొందర పడుతోందని, ఈ మేరకు ఫిబ్రవరిలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఏపీ- తెలంగాణలో పోలింగ్ జరిగే తేదీలపైన అంచనాలు మొదలయ్యాయి. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలకు బలం చేకూరుస్తున్నాయి.
ముందుగానే ఎన్నికలు : లోక్ సభకు ముందుగానే ఎన్నికలు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో లోక్సభ ఎన్నికలు మార్చి తొలి భాగంలోనే జరుగుతాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధినేతల కదలికలూ ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభ గడువు వచ్చే ఏడాది జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. దీని ప్రకారం మార్చి రెండో వారంలో షెడ్యూల్ను విడుదల చేసి.. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఘనవిజయం సాధించి.. తెలంగాణలోనూ పుంజుకున్న బీజేపీ.. ఇదే అదనుగా లోక్సభ ఎన్నికలకూ ఉత్సాహపడుతున్నట్లు చెబుతున్నారు. కొంత ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

మార్చిలోనే పోలింగ్ : మార్చికి బదులు ఫిబ్రవరి మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని సమాచారం. ఏడు నుంచి పది దశల్లో ఎన్నికలు జరగవచ్చని, గత ఎన్నికల తరహాలోనే తెలంగాణ, ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. దీని ప్రకారం మార్చి 10-15 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఏపీలో వైసీపీ, టీడీపీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఏపీ సీఎం జగన్ నియోజకవర్గ ఇంఛార్జిలను మారుస్తూ.. అభ్యర్థుల ఎంపిక కసరత్తూ మొదలు పెట్టారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పార్టీల హోరా హోరీ : ఏపీలోనూ గత షెడ్యూల్ కంటే 20రోజుల ముందే వచ్చే వీలుంది. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేయాలన్న యోచనలో కేంద్రం ఉందని జగన్ వివరించారు. దీంతో..జగన్ ఎన్నికల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాల పొత్తులు..సీట్ల సర్దుబాటు పూర్తయ్యే లోగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. జనవరిలో వరుస సంక్షేమ పథకాల అమలు..మేనిఫెస్టో ప్రకటన దిశగా కసరత్తు చేస్తున్నారు. అటు టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు చేస్తున్నాయి. అభ్యర్దుల ఎంపిక ముందుగానే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. దీంతో..మార్చిలో ఎన్నికల దిశగా ఏపీలో రాజకీయ సమరం మొదలైంది.












Click it and Unblock the Notifications