జగన్ మరో సంచలన ప్రకటన: ఉద్యోగులకు 27 శాతం ఐఆర్: సీపీఎస్ రద్దు..కేబినెట్లో ఆమోదం..!
ముఖ్యమంత్రిగా తొలి సారి సచివాలయంలో అడుగు పెట్టిన జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా 27 శాతం మధ్యంతర భృతి పైన ఈ నెల10న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అదే విధంగా సీపీఎస్ రద్దు పైనా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులతో స్నేహ పూర్వక వాతావరణం కోరుకుంటున్నామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లకు శుభవార్త చెప్పారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉద్యోగులు..పెన్షనర్లకు 27 శాతం మధ్యంత భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈనెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో దీని అమలు పైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే నూతన వేతన సంఘం తమ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించింది. అయితే, ఇప్పుడు డీఏ బకాయిల కంటే తాను ప్రకటించిన మధ్యంతర భృతి అమలు చేయటం ద్వారా మేలు జరుగుతుందని భావించారు. అందులో భాగంగా సచివాలయంలోని ఉద్యోగులతో సమావేశం సందర్బంగా జగన్ ఈ నిర్ణయం ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఐఆర్ చెల్లింపు విధి విధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు.
సీపీఎస్ రద్దు..కేబినెట్లో నిర్ణయం..
ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దు చేసేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. 2004 తరువాత జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో రెగ్యులర్ పెన్షన్ కాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమల్లోకి తెచ్చారుద. దీని పైన ఉద్యోగ సంఘాలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు..వారి అర్హతల ఆధారంగా వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయం పైనా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇంటి స్థలాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..
ఉద్యోగుల భద్రత తాను చూసుకుంటానని..ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఉద్యోగులు కొందరు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారని..అటువంటి వారిని తాను తప్పు బట్టనని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల అండ దండలు ప్రభుత్వానికి ఉంటేనే తన లక్ష్యాలు నెరవేర్చగలుగుతామని జగన్ వివరించారు. జగన్ తాజా వరాల పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.