NRCకి వైసీపీ వ్యతిరేకం.. ముస్లింలకు అండగా ఉంటాం.. సీఎం జగన్ కీలక ప్రకటన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారి..నిరసనలు..దోళనలకు కారణమైన ఎన్నార్సీ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని ప్రకటించారు. ఇప్పటికే ఇదే విషయం పైన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పిన అంశాలు అమలు చేస్తామని స్పస్టం చేసారు. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఏపీలో ఎన్నార్సీ అమలు చేయమని..దీనిని అన్ని వేదికల మీద వ్యతిరేకిస్తామని స్పష్టం చేసారు. అయితే, పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ మద్దతు ప్రకటించింది. కానీ, ఎన్నార్సీ కి వ్యతిరేకంగా ఏపీలోనూ పలు చోట్ల నిరసనలు కొనసాగాయి. కొందరు ముస్లిం మత నేతలు డిప్యూటీ సీఎంను కలిసి..తమ అభ్యంతరాలు చెప్పగా ఆయన ఇప్పటికే ప్రకటన చేసారు. తాజాగా ఏపీ సీఎం జగన్ సైతం ఇదే విషయాన్ని ఖరారు చేసారు. ముస్లింలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పౌరసత్వ బిల్లుకు వైసీపీ మద్దతు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి కేంద్ర ప్రతిపాదిత అంశాలకు వైసీపీ మద్దతు ప్రకటిస్తూనే ఉంది. అయితే, ఈ బిల్లు విషయంలో టీడీపీ సైతం మద్దతు ప్రకటించింది. అయితే, టీఆర్ యస్ మాత్రం బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకించింది. ఇప్పటికే ఎన్నార్సీని తాము అమలు చేయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీహార్ సీఎం నితీశ్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం గా తాను ఈ విషయం చెబుతానని తేల్చి చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో..
ఇక, కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ సైతం తమ విధానం తేల్చి చెప్పారు. ఎన్నార్సీ బిల్లుకు తమ మద్దతు ఉండదని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ విధానం అంజాద్ బాషా స్పష్టం చేసారని..దానికే కట్టుబడి ఉంటామని చెప్పటం ద్వారా ఏపీలో అమలు చేయబోమనే సంకేతాలకు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే , తాజాగా ప్రధాని స్వయంగా తాము ఎన్నార్సీ మీద చర్చించలేదని చెప్పటం ద్వారా ఈ వివాదం ముగిసిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీని మీద భిన్నవాదనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర నిర్ణయం ఎలా ఉన్నా..ఏపీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయం ఏంటో తేల్చి చెప్పేసింది.












Click it and Unblock the Notifications