నిరుపేదకు సీఎం జగన్ అసెంబ్లీ సీటు - ఇందిరమ్మ ఇంట్లో నివాసం..!!
సీట్ల కేటాయింపులో జగన్ లెక్కే వేరు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్న వేళ సీట్ల మార్పు పైనే చర్చ సాగుతోంది. కానీ, జగన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయాలు డిపాజిట్ చేస్తేనే సీట్లు ఇస్తున్నారని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో కనీసం సొంత ఇల్లు..బ్యాంకులో రూపాయి లేని నిరుపేద కార్యకర్తకు ముఖ్యమంత్రి జగన్ ఏకంగా అసెంబ్లీ సీటు కేటాయించారు.
జగన్ లెక్కే వేరు
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా సర్వేల నివేదిక ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో మడకశిర వైసీపీ సమన్వయ కర్తగా ఈర లక్కప్ప అనే సాధారణ వ్యక్తి, మాజీ సర్పంచ్ ను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేసారు. సిట్టింగ్ ను మార్చి ఈ ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చర్చకు కారణమవుతోంది. ఈర లక్కప్ప
మొన్నటి వరకు ఒక సాధారణ కార్యకర్త. మాజీ సర్పంచ్. 1989 నుంచి 99 వరకు స్వచ్ఛంద సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు గుడిబండ సర్పంచుగా ప్రజలకు సేవలు అందించారు. 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గా పనిచేశారు.

నిరుపేదకు సీటు
లక్కప్ప ప్రస్తుతం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. లక్కప్ప స్వగ్రామం గుడిబండ మండలం పలారం. తండ్రి దివంగత లక్కప్ప సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అయితే.. గతంలో అతి సామాన్య వ్యక్తిగా ఉన్న నందిగం సురేష్ ను 2019 ఎన్నికల సమయంలో జగన్ ఏకంగా ఎంపీగా చేసారు. అదే తరహాలో ఈర లక్కప్పను మడకశిర సమన్వయకర్తగా నియమించారు. అసలు విషయం ఏంటంటే లక్కప్పకు సీటు ఇవ్వాలని పెద్ద సంఖ్యలో నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అందులో ఎంపిక చేసి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న లక్కప్పను సీఎం ఎంపిక చేసారు.
కార్యకర్తగా గుర్తింపు
ఇప్పుడు లక్కప్ప ఎన్నికల కోసం ఏ మాత్రం ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పార్టీనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి శింగనమల, మడకశిర రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈక్రమంలో మడకశిర నియోజకవర్గం ఇన్చార్జ్గా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈర లక్కప్పను నియమించగా.. శింగనమల ఇన్చార్జ్గా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం.వీరాంజనేయులును నియమించారు. ఈ సారి ఎన్నికల్లో నలుగురు సామాన్యులకు జగన్ సీట్లు కేటాయించారు. ఇప్పుడు లక్కప్ప పైన టీడీపీ ఎవరిని అభ్యర్దికి ఖరారు చేస్తుందనేది చూడాలి. అయితే, లక్కప్ప ను గెలిపించుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications