రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే - వరద పెరిగే అవకాశం: అప్రమత్తం చేయాలి..!!
ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావిత గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. వారి కోసం ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో..స్వయంగా పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించిన సీఎం జగన్..శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఇరిగేషన్ శాఖ పైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించారు. దాదాపు 23 -24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.

ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్దా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అదే విధంగా పునరావాస శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే వారికి రూ రెండు వేలు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా లంక గ్రామల్లో పలు చోట్ల వరద నీరు రావటంతో రాకపోకలు స్తంభించాయి. ఏరియల్ సర్వే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిని సమీక్షించి మరి కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications