ఏపీలో 108, 104 ఉద్యోగుల వేతనాల పెంపు : సీఎం జగన్ నిర్ణయం..!
ఏపీలో పని చేస్తున్న 108, 104 ఉద్యోగుల జీతాలు దాదాపు రెట్టింపు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నేటి నుండి వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద అందిస్తున్న సేవలను పొరుగు రాష్ట్ర ఆస్పత్రుల్లోనూ అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఇప్పటికే ప్రతీ నియోజకవర్గంలోనూ 108, 104 అందుబాటులో ఉండేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నిధులు సైతం కేటాయించారు. ఇక, ఈ సర్వీసులను మెరుగు పరిచే క్రమంలో భాగంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల పెంపు పైన పాదయాత్ర సమయంలో జగన్ వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి తమ వేతనాలు పెంచాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు రెట్టింపు అయిన వేతనాలు..
ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ వేతనాలు పెంచాలని కోరుతూ..తమ సమస్యలను వివరించారు. దీనికి వెంటనే జగన్ స్పందించారు. వారి వేతనాల పెంపు పైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా పనిచేస్తున్నారని, వీరిలో పైలెట్(డ్రైవర్)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచేందుకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.

ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పరిధిలోకి ఉద్యోగులు..
ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. తాము సర్వీస్ ప్రొవైడర్ కింద పని చేయలేమని విన్నవించగా.. అందర్నీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని సీఎం చెప్పారని వారు తెలిపారు. ఇక, గతంలో ఇచ్చిన హమీ మేరకు ఈ రోజు నుండి వైయస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్న వారు వారికి అవసరమైతే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లోని మొత్తం 131 కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వీలుగా ప్రభుత్వం ఆ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ ట్రస్టులో చేర్చింది.
దీని ద్వారా ఏపీలో హెల్త్ కార్డు ఉన్న వారు ఆరోగ్య శ్రీ పధకం కింద ఆ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వెసులుబాటు కలుగుతుంది. డిసెంబర్ 21 నుండి వెయ్యి రూపాయాలు దాటిని ప్రతీ చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మార్చి నాటికి ప్రతీ మండలానికి 108,104 సర్వీసులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications