సీఎం జగన్ మార్క్ ఎంపిక, భారీ మార్పులు - హిట్ లిస్టులో ఎవరెవరు..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. సీనియర్లు - మంత్రులకు షాకులు ఇస్తున్నారు. ఎవరినీ దూరం చేసుకోవాలని లేదని చెబుతూ..పార్టీ గెలుపు కీలకమని తేల్చి చెబుతున్నారు. తాజాగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించిన సీఎం జగన్..మరిన్ని స్థానాల్లో మార్పులకు సిద్దమయ్యారు. దీంతో..ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.
జగన్ కీలక నిర్ణయాలు: ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో..గెలుపు మాత్రమే ప్రాతిపదకగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. గెలిచే అవకాశాలు లేని ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు. తాజాగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించిన సీఎం..మరో 36 నియోజకవర్గాల్లోనూ మార్పులకు సిద్దం అయినట్లు సమాచారం.

తొలి జాబితాలో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగింది. మలి విడత లో మరో ఆరుగురు మంత్రుల విషయంలోనూ నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. సీమ ప్రాంతంలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు...ఉత్తరాంధ్ర, గోదవరి జిల్లాల్లోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా సీనియర్ నేతలను కొన్ని చోట్ల మార్పు ఖాయమని చెబుతున్నారు.
బీసీ వర్గాలకు ప్రాధాన్యత: ఏపీలో సామాజిక న్యాయం - సంక్షేమం ఎన్నికల నినాదంతో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రి విడదల రజనీకి చిలకలూరి పేట నుంచి మార్చి గుంటూరు పశ్చిమంకు మార్చారు.
అదే విధంగా పవన్ కల్యాణ్ పైన గాజువాకలో గెలిచిన తిప్పారెడ్డి అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్థానంలో తన తనయుడికి ఇవ్వాలని కోరారు. కానీ, సీఎం అక్కడ బీసీ అభ్యర్దిని ఎంపిక చేసారు. అదే విధంగా రేపల్లెలో టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర గణేష్ ను ఖరారు చేసారు. అదే విధంగా మంగళగిరిలో గంజి చిరంజీవి ని ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీసీలనే ఎంపిక చేసారు.

గెలుపే ప్రామాణికంగా: ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టిక్కెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పట్నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రజామోదం లేనివారికి టిక్కెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇంచార్జుల మార్పు ద్వారా స్పష్టం చేసారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నామని సజ్జల స్పష్టం చేసారు.
అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని - వైఎస్ జగన్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోందని భవిష్యత్తులో కూడా మార్పులు ఉంటాయని అయన స్పష్టం చేసారు. దీంతో..ఎన్నికలకు ముందుగానే సీట్లపైన క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ నిర్ణయాల పైన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications