ఓటీఎస్ స్వచ్చందం - సమస్యలు సృష్టించే ప్రయత్నం : అవగాహన పెంచండి- సీఎం జగన్..!!
ఏపీలో ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్) పైన ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. ఉన్నత స్థాయి సమీక్షనిర్వహించిన సీఎం పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందమని తేల్చి చెప్పారు. క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఓటీఎస్పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.

యూజర్ ఫీజుల రద్దు
22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నామని వివరించారు. పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు..
గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదన్నారు. సుమారు 43వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని సీఎం వివరించారు. ఇవాళ మాట్లాడుతున్నవారు... అప్పుడు ఎందుకు కట్టించున్నారని ప్రశ్నించారు. గతంలో అసలు, వడ్డీ కడితే బి-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని సీఎం గుర్తు చేసారు. ఇప్పుడు ఓటీఎస్ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని.. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుందని వెల్లడించారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.

పూర్తిగా లబ్దిదారుల ఇష్టం మేరకే
ఆ అవకాశాలను వాడుకోవాలా.. లేదా అన్నది వారి ఇష్టంగా పేర్కొన్నారు. డిసెంబర్ 21 నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications