రోడ్ల మర్మతులను పూర్తిచేయాలి - గ్రామాల్లో పరిస్థితులతో ఆందోళన : సీఎం జగన్..!!
ఉపాధి హామీ పనులు.. రోడ్ల మరమ్మత్తుల పైన సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్సమీక్ష చేపట్టారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం కీలక సూచనలు చేసారు.
గ్రామాలపై స్పెషల్ ఫోకస్
ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలి అధికారులకు సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని సీఎం సూచించారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్లాలన్న సీఎం..పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిన పరిస్థితులను గుర్తు చేసారు. అలాంటి పరిస్థితులను మార్చాలని సీఎం స్పష్టం చేసారు.
రోడ్ల నిర్మాణం క్రమం తప్పకుండా
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలని నిర్దేశించారు.రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా సీఎం సమీక్ష చేసారు. గత ప్రభుత్వం హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈసారి రోడ్ల నిర్మాణం, మర్మతులను పూర్తిచేయాలని ఆదేశించారు.
Recommended Video
ఉత్తమ కార్యాచరణ అమలు చేయండి
భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలని సూచించారు. ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్ పనులు నిర్వహించాలన్నారు. దీనికోసం నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను ఆలోచించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్...ఇళ్ల నిర్మాణం పూర్తయ్కేనాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలని సూచించారు.