కేబినెట్ విస్తరణ డేట్ ఫిక్స్..!! గవర్నర్ షెడ్యూల్ పై ఆరా : ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!!
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా. ఇప్పడు వైసీపీలో కీలకంగా నడుస్తోన్న చర్చ ఇదే. దీనికి అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎదురు చూసిన ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు రేపు (మంగళవారం) చివరి రోజు. వైసీపీ తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. ఈ ఎన్నికలు సైతం ఏకగ్రీవమనే వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Recommended Video

కేబినెట్ విస్తరణ దిశగా వేగంగా అడుగులు
ఎన్నికలు జరిగే ఎనిమిది జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజార్టీ ఉండటంతో అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఒక వేళ టీడీపీ పోటీ పెడితే..పోటీ తప్పదు. ఇక, జగన్ కేబినెట్ లోని ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. నాడు మంత్రి పదవులు ఖరారు చేసే సమయంలోనే రెండున్నరేళ్ల తరువాత 90 శాతం వరకు మంత్రుల మార్పు ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు మొత్తం కేబినెట్ లోని మంత్రులను మార్చాలని నిర్ణయించారు.

సర్వే నివేదికల ఆధారంగా ముందుకు
అదే సమయంలో మంత్రులను తప్పించి..కొత్త వారిని తీసుకుంటారనే విషయం నిర్ధారణ అయిన సమయం నుంచి కొంత మంది మంత్రులు గతంలో లాగా యాక్టివ్ గా కనిపించటం లేదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇక, ముఖ్యమంత్రి జగన్ సైతం పార్టీ - ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో నిఘా సంస్థతో పాటుగా ప్రయివేటు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి ... ఈ సారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గం లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణ తేదీ పైన పార్టీలో చర్చ
ఇక, ఎన్నికలు అన్నీ కూడా పూర్తి కావటంతో సార్వత్రిక ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. ముందుగా కేబినెట్ విస్తరణ పైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్యనేతల వద్ద చర్చ జరుగుతోంది. అందు కోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. దీంతో రెండు డేట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి. డిసెంబర్ 5 న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని.. ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాలస సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ డేట్ పైన ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా..ఆ డేట్ కే ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

సమయం కోరుతున్న సీనియర్లు
ఇదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులు తాము మంత్రులుగా సాంకేతికంగా రెండున్నరేళ్ల పాటు ఉన్నా.. కరోనా కారణంగా పని చేసే అవకాశం పూర్తిగా రాలేదని చెబుతున్నారు. మరో ఆరు నెలల కాలం తమకు సమయం ఇవ్వటం ద్వారా సమర్ధత నిరూపించుకుంటామనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఆరు నెలలు పొడిగించి.. ఎన్నిలకు ఆరు నెలల కాలం ముందుగానే ప్రభుత్వ పాలన, పూర్తిగా ఎన్నికల పైన ఫోకస్ చేస్తే, ఇక..కొత్త మంత్రులు ఏడాది పాటు మాత్రమే పని చేసే అవకాశం ఉంటుందని..దీనీని ఎలా అంగీరిస్తారనే వాదన సైతం వినిపిస్తోంది. కేబినెట్ ప్రక్షాళన ఖాయమని చెబుతున్నా.. ఎప్పుడనేది మాత్రం సీఎం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

పక్కా సమీకరణాలతో కొత్త కేబినెట్ కూర్పు
ఇప్పటికే సామాజిక- ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త కేబినెట్ పైన లెక్కలు పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక, సీనియర్లకు పార్టీ తరపున కొత్త కమిటీ ఏర్పాటు చేసి..వారికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యతలు నిర్వహణ అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న సీఎం జగన్..ఇక, మరింత వేగంగా పార్టీలో - ప్రభుత్వంలో అడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వైసీపీ రాజకీయాల్లో మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ సహకారం సైతం
ఆయన సూచన మేరకే కొత్త కేబినెట్ ..ప్రజల్లోకి ముఖ్యమంత్రి.. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం...పధకాల నిర్వహణ తనిఖీలు వంటివి చేయటం ద్వారా సానుకూలత పెంచుకొనే ప్రయత్నాలు చేయనున్నారు. దీంతో.. డిసెంబర్ మొదటి వారం లేదా.. రెండో ముహూర్తంగా డిసెంబర్ మూడో వారంలో ఒక రోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. మరి ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరణ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications