విద్యార్ధులకు ఇక డిజిటల్ బోధన - సీఎం జగన్ ఆదేశాలు..!!
ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ పైన సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్ణయం తీసుకున్నవిధంగా 8వ తరగతి విద్యార్ధులను టాబ్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
Recommended Video

అన్ని తరగతి గదుల్లోనూ దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. తాజాగా.. జగనన్న విద్యా దీవెన కింద మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేసారు. ప్రతీ ఇంట్లోనూ పిల్లలను చదవించాలని సీఎం సూచించారు. ఫీజు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం రీ యంబర్స్ చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాడు నేడు కింద పాఠశాలల్లో చేపట్టి మరమ్మత్తుల గురించి అధికారులు వివరించారు. పెద్ద చదువులు పేదల హక్కులుగా మారుస్తున్నామని సీఎం స్పష్టం చేసారు. పెద్ద చదువులు ప్రోత్సహిస్తూ పూర్తిగా వందశాతం ఫీజురీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.

ఇలా క్రమం తప్పకుండా ప్రతీ మూడు నెలలకు ఒకసారి.. ఆ మూడు నెలలు అయిన వెంటనే డబ్బును అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఒక్క విద్యారంగంలోనే జగనన్న అమ్మ ఒడి, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, బైజూస్తో ఒప్పందం, హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కరికుళంలో కూడా మార్పులు చేశాం. డిగ్రీ చదువుతున్న పిల్లలు పది నెలల పాటు ఇంటర్న్షిప్ చేసేలా, ఆన్లైన్లో రకరకాల వర్టికల్స్ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications