అమ్మ ఒడి’ పథకానికి హాజరు తప్పనిసరి-ఇక నుంచి బడులు ప్రారంభంలోనే : ఏయిడెడ్ స్కూళ్ళ పైనా- సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై సీఎం ఆరా తీసారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి...ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని అధికారులు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని అధికారులు నివేదించారు.

అమ్మఒడికి హాజరు తప్పనిసరి
అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలని.. పిల్లలంతా బడిబాట పట్టాలని సీఎం స్పష్టం చేసారు. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామని సీఎం గుర్తు చేసారు. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితులు వచ్చాయంటూ..పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసారు.

బడుల ప్రారంభం వేళ అమ్మఒడి
2022 నుంచి 'అమ్మ ఒడి' పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్లో పిల్లల్ని స్కూల్కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సీఎం జగన్ స్పష్టం చేసారు. అకడమిక్ ఇయర్తో అమ్మ ఒడి అనుసంధానం కావాలని నిర్దేశించారు. అదే విధంగా..అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

సీబీఎస్ఈ అమలు పై రూట్ మ్యాప్
2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని సీఎం లక్ష్యంగా డిసైడ్ చేసారు. కాలక్రమేణా ప్రి హైస్కూల్ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా కానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్కి ఉపయోగపడేలా ఉండే షూ ఇవ్వాలన్నారు. స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించిన సీఎం.. కొన్ని సూచనలు చేశారు. ప్రతి స్కూల్కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.

పాఠశాలలకు ర్యాంకింగ్ లు
స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్లు ఇస్తామంటూ అధికారుల ప్రతిపాదన చేసారు. ఇలాంటి ఏ మార్పులు తీసుకు వచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశాంచారు. టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురిచేయడానికో ఇలాంటి విధానాలు కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులకు సీఎం సూచించారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ఆడిటింగ్ ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేసారు.
Recommended Video

ఏయిడెడ్ స్కూళ్లపై సీఎం స్పష్టత
ఎయిడెడ్ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని సీఎం వెల్లడించారు. లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటూ అధికారులకు సీఎం స్పష్టం చేసారు. ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టంచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.












Click it and Unblock the Notifications