సీఎం జగన్ ఆపరేషన్ గోదావరి, పొత్తుల వేళ - నేతలకు పిలుపు, టార్గెట్ ఫిక్స్..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలే కీలకం. ఇప్పుడు సీఎం జగన ఆపరేషన్ గోదావరి ప్రారంభించారు. రెండు రోజుల గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పవన్ వారాహి యాత్ర తరువాత మారిన సమీకరణాలు...నేతల మధ్య ఆధిపత్య పోరు వేళ సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
రెండు రోజులు గోదావరి జిల్లాల్లో:ముఖ్యమంత్రి నేటి నుంచి రెండు రోజులు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం రాజమండ్రిలో బస చేయనున్నారు. అక్కడ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ మేరకు పార్టీ నేతలకు పిలుపు వచ్చింది. టీడీపీ, జనసేన పొత్తు తో గోదావరి జిల్లాల్లొ ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పటికే సర్వే నివేదికలు స్పష్టం చేసాయి.

పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లోనూ సుదీర్ఘంగా తన యాత్ర కొనసాగించారు. అక్కడ వైసీపీ నేతల ఆధిపత్య పోరు ఈ మధ్య కాలంలో కలకలానికి కారణమైంది. దీంతో, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సంబంధించిన రూట్ మ్యాప్ తో పాటుగా నేతల వివాదాల ముగింపు దిశగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
నేతల వివాదాలపై సీఎం ఫోకస్:అమలాపురం లో మంత్రి వేణు..ఎంపీ విశ్వరూప్ మధ్య వివాదం తాత్కాలికంగా ముగిసినా, రామచంద్రాపురం అభ్యర్ధి విషయంలో సీఎం నిర్ణయం కీలకం కానుంది. తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో రామచంద్రా పురం నుంచి సీటు ఇవ్వాలని ఎంపీ బోసు డిమాండ్ చేస్తున్నారు. బోసు వర్సస్ వేణుగా మారిన రామచంద్రాపురం రాజకీయంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పిలుపు వచ్చింది. ఇప్పుడు రాజమండ్రిలో సీఎం జగన్ ఈ ముగ్గురి నేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అభ్యర్ధి విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కాకినాడలో పరిణామాల పైన సీఎం స్పందించే ఛాన్స్ ఉంది.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం:వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం ఇప్పటికే నియోజకవర్గాల్లో పోటీ పెరిగింది. ఎవరికి వారు సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేట వంటి నియోజకవర్గాల్లో ఈ పోటీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి క్రిష్ణారావు మధ్య గ్యాప్ వచ్చింది.
ఇక, పవన్ కల్యాణ్ యాత్ర తరువాత ఉభయ గోదావరి జిల్లాల్లో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్.. మరోసారి గోదావరి జిల్లాల్లో పట్టు కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నారు. దీంతో, ముఖ్యమంత్రి జగన్ గోదావరి జిల్లాల నేతల భేటీలో ఎటువంటి మార్గనిర్దేశం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications