అది గజ దొంగల ముఠా - దత్తపుత్రుడిని నమ్మద్దు: చిచ్చు పెడుతున్నారు- సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేనాని పవన్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించాలని సీఎం ప్రజలకు సూచించారు. ఆళ్లగడ్డ వేదికగా వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది రెండో విడత నిధులను సీఎం విడుదల చేసారు. 50.92 లక్షల మంది రైతులకు రూ 2,096.04 కోట్లు ఈ విడతలో అందనున్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ 13,500 చొప్పున ఇప్పటి వరకు 51 వేలు అందించామని సీఎం వివరించారు.
గతంలో ఇదే రాష్ట్రం..ఇదే బడ్జెట్..ఇప్పటి కంటే అప్పులు ఎక్కువ చేసినా.. చంద్రబాబు హయాంలో రైతులకు - పేదలకు ఎందుకు మంచి జరగలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచ చేసి..నిర్ణయం తీసుకోండంటూ సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో..పంచుకోత..తినుకో విధానం అమలు చేస్తే..ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ది దారుని ఎకౌంట్ లో నగదు జమ అవుతుందని వివరించారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదని ఎద్దేవా చేసారు.
ఈ మూడున్నారేళ్ల కాల పాలనలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. చంద్రబాబు - కరువు కవలలుగా అభివర్ణించారు. రైతులకు ప్రస్తుతం తమ ప్రభుత్వం లాగా దేశం మొత్తంలో ఏ ప్రభుత్వం చేయటం లేదన్నారు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ప్రతీ కుటుంబానికి అండగా నిలుస్తున్నామని సీఎం చెప్పారు. చంద్రబాబు సీఎంగా లేకపోవటంతో మద్దతు మీడియా - దత్తపుత్రుడు ఓర్చుకోలేకపోతన్నారని..వారి ప్రచారం నమ్మవద్దని సీఎం సూచించారు. అన్ని ప్రాంతాలు..అందరు ప్రజలు అభివృద్ధి చెందాలనేది తమ విధానమని స్పష్టం చేసారు.
పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ మూడున్నారేళ్ల కాల పాలనలో రైతులకు లక్షా 33 వేల కోట్ల మేర ప్రయెజనం అందించామని సీఎం చెప్పుకొచ్చారు. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిందన్నారు. చంద్రబాబు హయాంలో రైతు రుణ మాఫీ పేరుతో మోసం చేస్తే..ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకొని మళ్లీ రుణాలు పొందుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.