రైతులకు సీఎం జగన్ లేఖ - 11న మత్స్యకార భరోసా : సబ్సిడీపై పరికరాలు..!!
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదల ఉందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వ్యవసాయ శాఖ పైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. మే 16న రైతు భరోసా, జూన్ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు.
జూన్ మొదటివారంలోనే రైతులకు 3వేల ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే మే 11న మత్స్యకార భరోసా అందించనున్నారు. ఆర్బీకేల ద్వారా కార్యకలాపాలు సమగ్రంగా ఉండాలని.. ఆర్బీకే కార్యకలాపాలు సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలన జగన్ నిర్దేశించారు. పంటలకు ఎక్కడ మద్దతు ధరలు లభించకపోయినా వెంటనే అధికారులు స్పందించాలి, రైతులను ఆదుకునే చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
2021 ఖరీఫ్లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. రబీ 2021-22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయినట్లుగా నివేదించారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులతో వరుసగా మూడో పంటకూ రైతులు సిద్దంగా ఉన్నారని వివరించారు. ఖరీఫ్ 2022కు పూర్తిగా సన్నద్ధమయ్యాయన్న అధికారులు.. కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచుకున్నామని చెప్పారు. కౌలు రైతులకు అండగా నిలవటం పైనా చర్చించారు. సీసీఆర్సీపైన అందరికీ అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
కౌలు రైతులకు దీనివల్ల మేలు జరుగుతుందన్న సీఎం.. సీసీఆర్సీ వల్ల రైతు హక్కుకు ఎలాంటి భంగం కలగదని, దీనిపై పూర్తిస్థాయి సమాచారాన్ని వారికి వివరించాలన్నారు. అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా తన తరఫు నుంచి ఒక లేఖ పంపించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని అధికారులు చెప్పారు. దాదాపు 30శాతం విద్యుత్ ఆదా అయ్యింది, కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని లెక్కలు వివరించారు.
రైతులకు ఇండివిడ్యువల్గా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలపై సీఎం సమీక్షలో భాగంగా నిర్ణయించారు. ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు కాకుండా, రైతులకు సొంతంగా ఎలాంటి వ్యవసాయ పరికరాలు కావాలన్నదానిపై డిమాండ్ సర్వే నిర్వహించామని అధికారులు వివరించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.