రేపు ఢిల్లీకి సీఎం జగన్ : ప్రధాని-అమిత్ షా తో భేటీ : అమరావతి-ముందస్తు ఎన్నికలపై క్లారిటీ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. పొత్తుల పైన ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారని సమాచారం.
ఏపీకీ అండగా నిలవాలంటూ
ఏపీలో ఆర్దిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు..అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేసారు. కానీ, అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారో వివరించి.. వాటిని సాధించుకొనే క్రమంలో ఈ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో అమిత్ షా పర్యటన సమయంలోనూ రుణ పరిమితి వ్యవహారం పైన సీఎం నేరుగా తమ అభిప్రాయం వ్యక్తం చేసారు.
అమరావతి సహా కీలక అంశాలపై
ఆ సమావేశం తరువాత కొద్ది రోజులకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంది. అమరావతికి మద్దతుగా బీజేపీ సైతం రంగంలోకి దిగింది. అయితే, సీఎం మాత్రం మూడు రాజధాను ల బిల్లులను మరింత పక్కాగా సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్దిక పరిస్థితులు..పోలవరం కు సవరించిన అంచనాలు.. రాజకీయ అంశాలు ప్రధానంగా చర్చించనున్నట్లు చెబుతున్నారు.
పోలవరం సవరించిన అంచనాల కోసం మూడేళ్లుగా సీఎం కోరుతున్నా..కేంద్రం నుంచి సానుకూలత రాలేదు. దీంతో..దీని పైన ఈ పర్యటనలో క్లారిటీ తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మూడు రాజధానుల అంశం..అమరావతి భవిష్యత్ గురించి సీఎం కేంద్రంలోని ముఖ్యులతో చర్చిస్తారని తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికల పై ప్రచార వేళ
తాజాగా.. నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలిస్తామని చెప్పటం ద్వారా ..ఏపీకి ప్రత్యేక హోదా అపైన మరోసారి ఒత్తిడి పెరిగింది. ఈ అంశం పైన సీఎం చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటుగా..రాజకీయ అంశాల పైన సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని స్వయంగా అమిత్ షా ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలో జమిలి ఎన్నికల పైనా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికల అంశం పైన అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మద్దతు ప్రకటించారు.
రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలపైనా
ఇక, త్వరలో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు అభ్యర్ధులను నిలబెట్టే అంశం పైన తమతో సఖ్యతగా ఉన్న పార్టీల నేతలతో కేంద్రంలోని ముఖ్య నేతలు సంప్రదింపులు ప్రారంభించారు. ఇదే అంశం పైన సీఎం జగన్ తోనూ వారు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, తాము అన్ని రకాలుగా కేంద్ర నిర్ణయాలకు మద్దతిస్తున్నా..తమ డిమాండ్ల విషయంలో కేంద్రం ఉదాసీనంగా ఉందనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. అందులో భాగంగా.. తాజాగా భారీ వర్షాలు - వరదల కారణంగా ఏపీలోని మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి.
మీ నుంచి సహకారం ఇదేనా
దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిట్లింది. కేంద్రానికి సంబంధించి అధికారులు సైతం క్షేత్ర స్థాయలో పర్యటనలు చేసారు. అయితే, రెండు రోజుల క్రితం కేంద్రం వరదల కారణంగా నష్టపోయిన ఇతర రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఏపీ ఊసెత్తలేదు. ప్రధాని హామీ ఇచ్చారని .. సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా..స్పందన లేదు. ఈ అంశం పైనా సీఎం చర్చించే ఛాన్స్ ఉంది. ఇక, రాజకీయంగానూ ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో..సీఎం జగన్ ఈ సారి ఢిల్లీ యాత్ర ఏపీ రాజకీయాల్లో..పాలనా పరంగానూ ఆసక్తి పెంచుతోంది.