కొత్త ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం జగన్ మార్క్ డెసిషన్ - జాబితాలో...!?
అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ సీఎం జగన్ ఎమ్మెల్సీల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏపీలో ఎన్నికలకు ముందస్తు కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్నారు. పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఎమ్మెల్యేల పని తీరు..క్షేత్ర స్థాయి నివేదికలతో సీఎం జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే పని తీరు మెరుగు పర్చుకోవాల్సిన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసారు. ఇప్పుడు వైసీపీ నుంచి 16 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది. ఈ కేటాయింపు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు ప్రారంభించారు. ఒకే సారి 16 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా.. ఈ రోజున కీలక భేటీ జరగనుంది.

అందరి పేర్లు ఒకే సారి ప్రకటించేలా..
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యే భారీగా ఉండనుంది. టీడీపీ హయాంలో ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్సీల కాలపరమితి దాదాపు ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన 9 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 29తో ఎమ్మెల్యేల కోటాలో మరో 7 స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 16 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో..ఈ 16 మంది ఎంపిక కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా జూలై లో గవర్నర్ కోటాలోనూ మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దిశగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్న వేళ.. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. జిల్లాలు.. సామాజిక సమీకరణాలు..గతంలో హామీ ఇచ్చిన వారి లెక్కల ఆధారంగా కొత్త ఎమ్మెల్సీల ఎంపిక పైన ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో జగన్ నిర్వహించే సమావేశంలో అధికారికంగా డిసైడ్ చేయనున్నారు.

ఎమ్మెల్యే సీట్లు .. ఎమ్మెల్సీలుగా ఛాన్స్
మొత్తం 175 సీట్లు గెలవాల్సిందేననే నినాదంతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాల పొత్తుల వేళ..సామాజిక సమీకరణాలే కీలకంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లో ఎంత మందిని మార్చాల్సి ఉంటుందనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. నివేదికల ఆధారంగా నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్దం చేస్తూనే..ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలకు అనుగుణంగా పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. ఆరు నెలల ముందే అభ్యర్ధులను ఖరారు చేయాలనే సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీ ఉన్న చోట ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో పరిగణలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో గతంలో హామీ ఇచ్చిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. ఒకేసారి 18 మంది ఎమ్మెల్సీలను ఖరారు చేయటం ద్వారా ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లకు పోటీ పడుతున్నవారిలో కొందరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

వీరి పేర్లకు ఆమోదం ఖాయమేనా..
ఎమ్మెల్సీ జాబితాలో కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి కి అవకాశం దక్కనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే జయమంగళం వెంకటరమణ పేరు ప్రకటించారు. మరో స్థానం నుంచి గుణ్ణం నాగబాబు లేదా వంకా రవీంద్రకు ఛాన్స్ కనిపిస్తోంది. గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ కు ఈ సారి అవకాశం దక్కనుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నీలకంఠం నాయుడు లేదా నర్తు రామారావు పేర్లు పరిశీలలో ఉన్నాయి. తూర్పు గోదావరి స్థానం నుంచి కుడపూడి సూర్యనారాయణ పేరు వినిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల్లో వంశీని వ్యతిరేకిస్తున్న వెంకటరావు, రామచంద్రరావులో ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. రాయసీమలో ఆశావాహుల పోటీ ఎక్కువగా ఉంది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బీసీ వర్గాలకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. హిందూపురం వైసీపీ సీనియర్ నేతకు ఈ సారి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. జంకె వెంకటరెడ్డి పేరు రేసులో ఉంది. నెల్లూరులో మారుతున్న సమీకరణా లతో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications