ఎమ్మెల్యే వసంత ఉంటారా - వెళ్తారా : సీఎం జగన్ పిలుపు - ఫైనల్ డెసిషన్..!?
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. వసంత పార్టీ మార్పు ప్రచారం వేళ సీఎం నిర్ణయం కీలకం కానుంది.
ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. నెల్లూరు పరిణామాల తరువాత పార్టీలో నేతల మధ్య విభేదాలను సీరియస్ గా తీసుకున్నారు. నెల్లూరు లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మరో ఇద్దరు నేతలకు అప్పగించారు. ఇప్పుడు కృష్ణా జిల్లా మైలవరం పంచాయితీ పైన ఫోకస్ పెట్టారు.
అక్కడ మంత్రి జోగి రమేష్ వర్సస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. కొద్ది రోజులుగా వసంత పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం నుంచి పిలుపు రావటంతో..మైలవరం విషయంలో సీఎం ఆయనతో మాట్లాడిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మైలవరం పైన గతంలో మార్గనిర్దేశం
వై నాట్ 175 నినాదంతో జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన నియోజకవర్గాల్లో తిరిగి గెలిచి తీరాల్సిందేనని లక్ష్యం గా ఫిక్స్ చేసారు. అందులో భాగంగా ఇప్పుడు కీలకమైన కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో పార్టీ నేతల మద్య వర్గ పోరు సాగుతోంది.
దీని పైన కొద్ది రోజుల క్రితమే మైలవరం నియోజకవర్గ పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో గెలిచి తీరాల్సిందేనని స్పష్టం చేసారు. కానీ, అక్కడ మంత్రి జోగి రమేష్ వర్సస్ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా మంత్రి జోగి రమేష్ పైన ఎమ్మెల్యే వసంత వర్గీయుల వ్యవహార శైలి పైన నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి.

మంత్రి జోగి రమేష్ తో చర్చలు.. ఎమ్మెల్యేకు పిలుపు
మంత్రి జోగి రమేష్ బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎంతో కలిసి కారులోనే తాడేపల్లి వెళ్లారు. ఆ సమయంలో మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. మైలవరంలో టీడీపీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయని..ఈ సమయంలో వైసీపీలో ఇలా ఇద్దరు నేతల మధ్య విబేదాలు ఉండటం ఏంటని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం.
దీని పైన జిల్లా బాధ్యుల నుంచి సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో...పాటుగా కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వసంత పార్టీ మార్పు పైన చర్చ సాగుతోంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం తాను పార్టీ మారటం లేదు. పార్టీ మారే పరిస్థితి వస్తే రాజకీయాలను వీడుతానని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్
ఈ సమయంలో ఎమ్మెల్యే వసంతకు పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడనున్నారు. మైలవరంలో పరిస్థితులు..జోగి రమేష్ తో సమస్యల పైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం నిర్వహణలో ఎమ్మెల్యే పని తీరు గురించి ప్రశ్నించనున్నారు. సీఎం తో చర్చల సమయంలో ఎమ్మెల్యే వసంత ఇచ్చే స్ఫష్టతకు అనుగుణంగా ముఖ్యమంత్రి మైలవరం గురించి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
వసంత వచ్చే ఎన్నికల్లొ పొటీకి సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మైలవరం పంచాయితీని ఈ రోజు ముగించి..పూర్తి స్పష్టత ఇచ్చే దిశగా సీఎం నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, సీఎం నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications