చంద్రబాబుకు కుప్పంలోనే చెక్: భరత్కు మంత్రి పదవంటూ సీఎం జగన్ కీలక ప్రకటన
అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ విజయం నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 175 స్థానాలకు తొలి అడుగు కుప్పం నుంచే పడుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గంకు ఎక్కువ మేలు జరిగిందన్నారు సీఎం జగన్.
కుప్పంలో గెలిపిస్తే భరత్కు మంత్రి పదవి: జగన్
కుప్పం నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమైన జగన్.. వివిధ అంశాలపై వారికి సూచనలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని అన్నారు. కుప్పం తన సొంత నియోజకవర్గం లాంటిదని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భరత్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు జగన్.
కుప్పం కూడా తన నియోజకవర్గమేనంటూ జగన్
కుప్పం నియోజకవర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని చెప్పారు. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని, కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటానన్నారు. 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో భరత్ తోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం భరత్ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రూ. 65 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో జీవో విడుదలవుతుందని, పనులు కూడా మొదలు పెట్టొచ్చన్నారు. కుప్పంకు సంబంధించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు.
కుప్పం టీడీపీకి కంచుకోట కాదంటూ జగన్
కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం అని సీఎం జగన్ అన్నారు. బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం. దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు. అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్ను తీసుకువచ్చాం అని సీఎం జగన్ తెలిపారు.భరత్ను గెలుపించుకు రండి. .భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను అని చెప్పారు. అయితే, నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు.. ఆయన సీఎం అవుతాడు.. కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటూ వెళ్లారని అన్నారు.నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.