హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ..!!
ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఆదివారం రాత్రి అమిత్ షా ను కలిసారు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో పొత్తు రాజకీయాలు .. ఎన్నికల సంసిద్దతలో భాగంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడు రోజులు ఢిల్లీలోనే మకాం:ముఖ్యమంత్రి జగన్ మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేసారు. నీతి అయోగ్ సమావేశంతో పాటుగా కీలక సమావేశాలు నిర్వహించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రితో ముచ్చటించారు. రాత్రి ఇద్దరు దాదాపు 40 నిమిషాలు సమావేశం అయ్యారు. పాలనా పరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏపీకి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారని సీఎంఓ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని కోరినట్లు పేర్కొంది. ఇదే అంశం పైన ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి షెకావత్ తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు.

అమిత్ షాతో భేటీ వేళ:దీంతో పాటుగా ఢిల్లీలోని ఏపీ భవన్ సహా విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లోని ఆస్తుల విభజనపైనా ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో రాజకీయ పరిణామాల పైన వీరిద్దమరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ఓపెన్ గా స్పష్టం చేసారు. బీజేపీ ముఖ్య నేతలను కలిసి పొత్తు ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు. దీని పైన బీజేపీ ముఖ్య నేతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో సీఎంతో భేటీ సమయంలో రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కీలక చర్చలతో ఆసక్తి:ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ఏడాది ఆర్దికంగా సమస్యలు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పథకాల అమలుతో పాటుగా పెండింగ్ బకాయిలు చెల్లింపు పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కేంద్రం నుంచి ఆర్దికంగా తోడ్పాటును కోరుతున్నారు. కొద్ది రోజుల కాలంలోనే కేంద్రం నుంచి ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు వెలువడ్డాయి. నిర్మలా సీతారామన్ తో సమావేశంలోనూ ఇదే అంశం పైన చర్చలు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎన్నికల ఏడాదిలో నిర్ణయాలు..అమలు కీలకం కావటంతో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి రాష్ట్రానికి మరింత ప్రయోజనం దక్కేలా అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలోనూ ప్రతిపక్షాల విమర్శల సమయంలో ప్రధాని నిర్ణయానికి సీఎం జగన్ బాసటగా నిలిచారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications