మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్లో శంకుస్థాపన, పోర్టులపై సమీక్షలో సీఎం జగన్
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, పాత పోర్టుల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. దుగ్గరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫస్ట్ ఫేజ్లో భావనపాడు, మచిలీపట్నం రామాయపట్నం పోర్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.
మచిలీపట్నం స్పీడప్..
పాత పోర్టులతో సహా కొత్త పోర్టుల ప్రతిపాదనలపై కూడా సీఎం జగన్ అధికారులను అడిగారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. పోర్టుకు భూమి అందుబాటులో ఉందని అధికారులకు సీఎం జగన్ చెప్పారు. మిగిలిన పోర్టులు నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూమిని సేకరించాలని కోరారు. సీఎం జగన్ ఆదేశాలతో మచిలీపట్నం పోర్టుకు వచ్చే జూన్ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా వచ్చే జూన్ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేస్తామని తెలిపారు. మే లేదంటే జూన్ నాటికి రెండు పోర్టులకు శంకుస్థాపన చేయొచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ మేరకు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నవరత్నాలు, నాడు-నేడు
ప్రభుత్వ ప్రాధాన్యతలు నవరత్నాలు, నాడు-నేడు కార్యక్రమాలని కూడా జగన్ అధికారులకు తెలిపారు. నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జగన్ ఆకాంక్షించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సంజీవనిలా నవరత్నాలు పనిచేస్తాయని జగన్ చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని జగన్ పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణం కూడా..
ఏడాదికి 6 లక్షల ఇళ్లు నిర్మించాలనే అంశం తన రెండో ప్రాధాన్యం అని జగన్ వివరించారు. రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు వెళ్తున్న కాల్వల విస్తరణ మూడో ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరో ప్రయారిటీ అని చెప్పారు. పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ అక్కడినుంచి బనకచర్లకు గోదావరి జలాలు మరో ప్రయారిటీ అని.. ప్రతీ జిల్లాకు తాగునీరుని అందించాలనేది వాటర్ గ్రిడ్ ఉద్దేశం అని చెప్పారు. సంక్షేమ పథకాలతో వ్యవసాయ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పారు. కరువు ప్రాంతాలకు ఊరట లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యుత్ సంస్కరణలపై కూడా
విద్యుత్ సంస్కరణల అంశాన్ని కూడా అధికారులతో సీఎం జగన్ చర్చించారు. విద్యుత్ సబ్సిడీకి ఏటా రూ.10 వేల కోట్లు ట్రాన్స్ కోకు చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ట్రాన్క్ కోకు ఇస్తే సరిపోతుంది కదా అని అధికారులతో జగన్ అన్నారు.