పీఆర్సీపై నేడే సీఎం జగన్ డెసిషన్ - రేపు ఉద్యోగుల సమక్షంలో ప్రకటన : బర్త్ డే గిఫ్ట్ గా...!!
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ పైన ఈ రోజు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విడతల వారీగా ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ పైన చర్చలు జరిగాయి. పీఆర్సీ పైన అధ్యయనం చేసిన సీఎస్ ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. పలు సిఫార్సులు చేసింది. అయితే, వాటిని ఉద్యోగ సంఘాలు తిరస్క రించాయి. కమిటీ సూచించిన విధంగా కాకుండా..తమకు 40 శాతం పిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

పీఆర్సీపై జగన్ కీలక సమావేశం
దీంతో..ఆర్దిక మంత్రి బుగ్గన...ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు. ఆర్దికేతర సమస్యల పైన ఈ నెల 22న సమావేశం నిర్వహించి...అన్నీ పరిష్కార దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన ఉప సంహరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లుగా ప్రకటించాయి. ఇక, ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ఏపీ ఆర్దిక పరిస్థితి...ప్రభుత్వం రెవిన్యూ...జీతాల చెల్లింపుల ఖర్చు గురించి ప్రభుత్వం వివరించింది. ఈ చర్చల సారాంశాన్ని బుగ్గన..సీఎస్..సజ్జల సీఎం జగన్ కు వివరించారు.

సీఎంతో భేటీ తరువాత ఉద్యోగులతో చర్చలు
ఇక, ఈ రోజు మధ్నాహ్నం సీఎస్ తో పాటుగా సజ్జలతో సీఎం సమావేశం కానున్నారు. మరింతగా పీఆర్సీ అంశాన్ని సాగదీయకుండా ముగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఫిట్ మెంట్ పైన ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎంతో చర్చల తరువాత ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి సజ్జల...సీఎస్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫిట్ మెంట్ పైన వారితో చర్చించి..వారి అభిప్రాయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించే ఫిట్ మెంట్ శాతం పైన ఉద్యోగ సంఘాల స్పందన చూసిన తరువాత రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి తో ఉద్యోగ సంఘాల సమావేశం పైన క్లారిటీ రానుంది.

జన్మదినం నాడు పీఆర్సీ ప్రకటనకు ఛాన్స్
రేపు ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ముందు లేదా తిరిగి వచ్చిన తరువాత ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం అవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి అధికారికంగా పీఆర్సీ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా 40 శాతం..ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ కు మధ్యస్తంగా నిర్ణయం సీఎం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
30-34 శాతం మధ్య ఫిట్ మెంట్ అధికారికంగా సీఎం తన జన్మదినం నాడు ఉద్యోగుల కోసం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల ఆందోళన మొత్తం తనతో సమావేశం సమయంలో క్లియర్ చేసి..వారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఉద్యోగులతో నేరుగా సీఎం చర్చలు - ఎనౌన్స్ మెంట్
అయితే, ఉద్యోగ సంఘాలు సైతం తాము డిమాండ్ చేస్తున్న 40 శాతం కంటే తక్కవకు అంగీకరించక తప్పేలా లేదు. తెలంగాణ ప్రభుత్వంతో పోల్చి చూస్తున్నా.. ఏపీ ప్రభుత్వం చాలా కాలంగా 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఇక, ఫిట్ మెంట్ తో పాటుగా పెరిగే వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది మరో ఆసక్త కర అంశంగా మారింది. వచ్చే నవంబర్ నుంచి అమలు చేయాలని అధికారుల నివేదక సిఫార్సు చేసింది.
దీని పైన సీఎం జగన్ ఉద్యోగులకు అనుకూలంగా మరింత ముందు గానే వీటిని అమలు చేసే దిశగా నిర్ణయానికి అభ్యంతరం చెప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి రేపు పూర్తి క్లారిటీ.. ప్రకటన వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications