సీఎం జగన్ కీలక నిర్ణయం- కరోనా కారుణ్య నియామకాలు : పీఆర్సీ ఎప్పుడు-ఏం జరుగుతోంది..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం పైన ఆదేశాలిచ్చారు. కొవిడ్బారిన పడి అర్ధాంతరంగా కన్నుమూసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసారు.

కరోనా బాధిత ఉద్యోగ కుటుంబాలకు ఊరట
కారుణ్య నియామకాలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వ విధాన పర నిర్ణయం కోసం అమలు కాలేదు. ఇప్పుడు సీఎం నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగ..ఉపాధ్యాయ కుటుంబాల్లోని వారికి ఈ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాల బకాయిల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రస్తావన చేయకపోయినా..సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారికి రావాల్సిన బెనిఫిట్స్ యధావిధిగా అమలవుతాయి.

పీఆర్సీపై చర్చలకు నిరీక్షణ
ఇక, ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ పెండింగ్ అంశాల పైన కొద్ది రోజులుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగా పీఆర్సీ అమలు..సీపీఎస్ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దసరా పండుగ రోజుల్లో ఉద్యోగ సంఘాల జేఏసీలతో ప్రభుత్వంలోని ముఖ్యులు చర్చలు జరిపారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ సమస్య తేల్చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసి..ఉద్యోగ సంఘాలను ఆహ్వానిస్తారని..అందులో పీఆర్సీ పైన వారితో చర్చలు చేస్తారంటూ ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చారు.

డీఏ బకాయిల పైన స్పష్టత కోసం
అయితే, పిలుపు వస్తుందని ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీ ప్రకటించటంతో ఏపీ ప్రభుత్వం పైన ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే, ఏపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇక, సీపీఎస్ తో పాటుగా ఇతర సర్వీసు అంశాల పైన వచ్చే నెలాఖరులోగా పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులకు మూడు డీఏల బకాయిలు ఉన్నాయి. మూడు ఫ్రీజింగ్ డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2018 జూలై, 2019 జనవరి డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

నెలాఖరులోగా పీఆర్సీ పైన నిర్ణయానికి హామీ
ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితి కారణంగా ఉద్యోగులకు జీతాలు..పెన్షనర్లకు పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని ఈ సమస్య పరిష్కరించి..ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించేలా చూడాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో..ప్రభుత్వం సైతం అంగీకరించింది. ఇక నుంచి 1వ తేదీనే జీతాలు అందుతాయని హామీ ఇచ్చింది. ఇక, 27 శాతం ఐఆర్ ఇప్పటికే అమలు చేస్తున్నందున పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్దికంగా -పాలనా పరంగా ఉన్న సమస్యల కారణంగా ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.
Recommended Video

సీఎస్ తో చర్చలు..అందులోనే క్లారిటీ
ఇదే సమయంలో ఈ నెల 21వ తేదీన అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సమీర్ శర్మ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో ఆర్దిక అంశాలు మాత్రం వద్దంటూ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ప్రభుత్వం చెప్పిన విధంగా చర్చలకు సీఎస్ నుంచి వచ్చే పిలుపు కోసం ఉద్యోగ సంఘాల నేతలు నిరీక్షిస్తున్నారు. ఇక, ఉద్యోగ సంఘాల నేతల పైన ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో..ఈ రోజు సెలవు కావటంతో బుధ -గురువారాల్లోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని పైన ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం అందితేనే సమస్య పరిష్కారం లో ఒక అడుగు ముందుకు పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications