కరోనాపై పోరు.. వాలంటీర్లకు మరో కీలక బాధ్యత అప్పగించిన సీఎం జగన్..
కరోనా వైరస్ నియంత్రణ పట్ల ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలని.. ఇందుకోసం వాలంటీర్ వ్యవస్థ విస్తృత ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనాపై అపోహలు,ఆందోళనలను తొలగించేలా,స్వీయ నియంత్రణ పాటించేలా చైతన్యం కలిగించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,సీఎస్ నీలం సాహ్ని,డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాబోయే 2,3 వారాలు కీలకమని.. కరోనాపై వీలైనంత ఎక్కువ ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కరోనా పాజిటివ్గా తేలినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. అదే సమయంలో చుట్టుపక్కల వారు కరోనా బాధితుల పట్ల వివక్ష చూపకుండా ఉండేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కరోనా కస్లర్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా క్లస్టర్స్ను మరోసారి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అంతరాష్ట్ర ప్రయాణికుల రాకపోకల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 6 రాష్ట్రాల ప్రయాణికులపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల వారీగా 71 సెంటర్లలో 15,614 పడకలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications