రఘురామ పై సీఎం జగన్ ఫైనల్ డెసిషన్ - ముహూర్తం ఫిక్స్..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ విషయంలో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి. చాలా కాలంగా వైసీపీ ఎంపీ రఘురామ పైన చర్యల కోసం వేచి చూస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ నర్సాపురం పర్యటనలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. సొంత పార్టీ ఎంపీ ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్..వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల పైన విమర్శలు చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న రఘురామ పైన అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీని పైన రఘురామకు స్పీకర్ సెక్రటేరియట్ నోటీసులు ఇచ్చింది. కానీ, ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు.
ఇదే సమయంలో రఘురామ పైన ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసు..అరెస్ట్..ఆ సమయంలో రఘురామ చేసిన ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. తాను రాజీనామా చేసి.. నర్సాపురం నుంచి తిరిగి పోటీ చేస్తానంటూ చెప్పినా..రఘురామ అందుకు ముందుకు రాలేదు. ఇక, ప్రధాని మోదీ భీమవరం పర్యటన సమయంలో చివరి నిమిషం వరకు రఘురామ సభకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రధాని కార్యాలయం విడుదల చేసిన జాబితాలో స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ పేరు లేదు. దీంతో..ఆయన సభకు హాజరు కాలేదు. రఘురామ తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఈ నెల 28న నర్సాపురంలో పర్యటించనున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజునే సీఎం జగన్ నర్సాపురంలో పర్యటించాల్సి ఉంది. కానీ, భారీ వర్షాల కారణంగా 28వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున ముఖ్యమంత్రి నర్సాపురంలో అనేక ప్రాజెక్టులకు శంకుసస్థాపన చేయనున్నారు. ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన చేయటానికి షెడ్యూల్ ఖరారైంది. దీంతో..అక్కడే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్ధి ఎవరనేది సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రఘురామ అంశం పైన సీఎం జగన్ ఎక్కడా ఓపెన్ గా స్పందించలేదు. అసెంబ్లీలో పరోక్షంగా ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కొద్ది కాలం క్రితం రఘురామ వ్యవహార శైలి పైన ఫైర్ అయ్యారు.
జోగి రమేష్ వ్యాఖ్యలపైన సీఎం స్పందించారు. కానీ, రఘురామ పేరు మాత్రం ప్రస్తావించలేదు. జగన్ తన కేబినెట్ విస్తరణలో క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి తప్పించి..చీఫ్ విప్ పదవి అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం రాజకీయంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో, వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్..నర్సాపురం వేదికగా రాజకీయంగా కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి సామాజిక సమీకరణాల్లో భాగంగా సీఎం జగన్ ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది.